మంచాల, జూన్ 17 : స్వరాష్ట్రంలో గిరిజన తండాలకు అధిక నిధులు కేటాయిస్తుండటంతో అభివృద్ధి పరుగులు పెడుతున్నదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం మండలంలోని పటేల్చెర్వు తండాలో గిరిజన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా తండా గిరిజన మహిళలు సాంప్రదాయ గిరిజన దుస్తులతో ఎమ్మెల్యే కిషన్రెడ్డి, అధికారులకు లంబాడి నృత్యాలతో స్వాగతం పలికారు. ముందుగా గ్రామంలో రూ. 25 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీని ప్రారంభించారు. అనంతరం గిరిజనులతో కలిసి ఎమ్యెల్యే ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. గ్రామ పంచాయతీ వద్ద నిర్వహించిన సభలో గిరిజనుల ఆరాధ్యదైవం సంత్సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు.
గతంలో గిరిజన తండాలు అభివృద్ధికి నోచుకోక సమస్యలతో గిరిజనులు నిత్యం సతమతమయ్యేవారని, స్వరాష్ట్రంలో ఐదు వందల జనాభా గల తండాలను పంచాయతీలుగా సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారన్నారు. పటేల్చెర్వుతండా అభివృద్ధి కోసం సర్పంచ్ అడిగిన వెంటనే లక్షలాది రూపాయలను విడుదల చేసి తండాలో రోడ్లు, భూగర్భడ్రైనేజీ, వీధిదీపాలు వంటి సమస్యల పరిష్కారం కోసం నిధులు కేటాయించినట్లు చెప్పారు. సమస్యలు లేని పంచాయతీగా ఏర్పాటు కోసం ఎమ్మెల్యే నిధుల నుంచి రూ. 10లక్షలు కేటాయిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ నర్మద, సర్పంచ్ మెగావత్ రాజూనాయక్, ఆర్డీవో వెంకటాచారి, ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రయ్య, సహకార సంఘం చైర్మన్ పుల్లారెడ్డి, తహసీల్దార్ అనిత, ఎంపీడీవో శ్రీనివాస్, డీఈ అబ్బాస్, ఈవోఆర్డీ తేజ్సింగ్, ఏఈ సాయినాథ్ గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చీరాల రమేశ్, ప్రధాన కార్యదర్శి బహదూర్ తదితరులు పాల్గొన్నారు.
గిరిజనుల సమగ్రాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
కడ్తాల్ : గిరిజనుల సమగ్రాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం మండల పరిధిలోని వాసుదేవ్పూర్ గ్రామంలో నిర్వహించిన గిరిజనోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్యే జైపాల్యాదవ్, కలెక్టర్ హరీశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎనిమిది చెంచు కుటుంబాలకు మంజూరైన బోరు మోటర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ లచ్చిరాంనాయక్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. గిరిజనులను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని తెలిపారు. గిరిజనుల చిరకాల స్వప్నమైన తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని తండాలకు రూ.50 కోట్లతో బీటీ రోడ్లను వేయిస్తున్నామని తెలిపారు. చెంచుల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. చెంచు కుటుంబాలకు ప్రత్యేక నిధులతో పాడి పశువులు, కుట్టు మిషన్లు అందజేస్తామన్నారు. వాసుదేవ్పూర్ గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే రూ.10 లక్షలు మంజూరు చేశారు.
వైభవంగా దశాబ్ది ఉత్సవాలు
జిల్లాలో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ హరీశ్ అన్నారు. తొమ్మిదేండ్లలో తెలంగాణలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు తెలిసేలా ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. మిషన్ భగీరథతో గ్రామాల్లో మంచి నీటి సమస్య తీరిందని, ఉచిత కరెంట్తో వ్యవసాయ సాగు విస్తీర్ణం పెరిగిందని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే, కలెక్టర్ను గిరిజనులు శాలువాతో సన్మానించారు.
గ్రామ పంచాయతీ భవనాలకు శంకుస్థాపన
మండలంలోని కొండ్రిగానిబోడు తండా, గడ్డమీది తండాలో రూ.20 లక్షలతో చేపట్టిన గ్రామ పంచాయతీ భవనాలకు ఎమ్మెల్యే జైపాల్యాదవ్, ఎంపీపీ కమ్లీమోత్యానాయక్ స్థానిక నాయకులతో కలిసి భూమి పూజ చేశారు. మండలంలో నూతనంగా ఏర్పడిన అన్ని గ్రామాల్లో కొత్త జీపీ భవనాలను నిర్మిస్తామని వారు పేర్కొన్నారు. అనంతరం కడ్తాల్ మండల కేంద్రానికి చెందిన పోతగళ్ల జంగయ్యకి మంజూరైన రూ.30 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. లాసెట్-2023 పరీక్ష ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 367వ ర్యాంక్ సాధించిన ఆమనగల్లు సీఐ ఉపేందర్ని ఎమ్మెల్యే సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ కమ్లీమోత్యానాయక్, జడ్పీటీసీ దశరథ్నాయక్, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీ లచ్చిరాంనాయక్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు వీరయ్య, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పరమేశ్, సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి, చెంచు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య, మండలాధ్యక్షుడు కృష్ణ, ఎంపీడీవో రామకృష్ణ, డీటీ వినోద్కుమార్, ఎంపీవో మధుసూదనాచారి పాల్గొన్నారు.
రిజర్వేషన్లు పెంచిన ఘనత సీఎం కేసీఆర్దే..
ఆమనగల్లు : 6 శాతం ఉన్న గిరిజన రిజర్వేషన్లను 10 శాతానికి పెంచిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గిరిజన దినోత్సవాన్ని జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యుడు నేనావత్ పత్యానాయక్ అధ్యక్షతన శనివారం ఘనంగా నిర్వహించారు. సేవాలాల్ మహారాజ్ విగ్రహనికి పూలమాలలు వేసి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. రూ.2 కోట్లతో 30 గుంటల భూమిలో నిర్మిస్తున్న గిరిజన భవనానికి జిల్లా కలెక్టర్ హరీశ్, జడ్పీటీసీ అనురాధతో కలిసి భూమి పూజ, శంకుస్థాపన చేసి శిలఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆరోగ్యం కోసం ఆరోగ్య మహిళా పథకాన్ని ప్రవేశ పెట్టిందని, దీని ద్వారా ప్రతి మంగళవారం ఎంపిక చేసిన పీహెచ్సీలో మహిళలకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించి ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే ఉచితంగా వైద్యం అందించనున్నట్లు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాట్లాడుతూ..
గిరిజన రిజర్వేషన్లు పెంచాలని ఆసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపితే కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో తెలంగాణలో 10 శాతం పెంచామని ఆయన తెలిపారు. రాష్ట్ర అవిర్భావం తర్వాత 4 వేల ఎస్టీ తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. నియోజకవర్గంలో నూతన గ్రామపంచాయతీలకు 73 భవనాలు మంజూరైతె అందులో 54 భవనాలు ఎస్టీ గ్రామ పంచాయతీలే అని ఆయన అన్నాలరు. ఆమనగల్లు మున్సిపాలిటీలో నిర్మిస్తున్న గిరిజన భవనానికి నిధులు సరిపోకపోతే 50 లక్షల రూపాయలు తన ఫండ్ నుంచి కేటాయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. త్వరలో మరో 5 గుంటల భూమి కేటాయించి సేవాలాల్ గుడి నిర్మాణం కూడా చేసేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. త్వరలో రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీశ్రావుని తీసుకువచ్చి ప్రభుత్వ ఆస్పత్రి స్థాయి పెంపునకు శంకుస్థాపన చేస్తామని అన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీలు అనురాధ, దశరథ్నాయక్, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాంపాల్, వైస్ చైర్మన్ దుర్గయ్య, కౌన్సిలర్లు కమఠం రాధమ్మ, మాండన్ దివ్య, ఎంపీటీసీ కుమార్, సరిత, సీఐ ఉపేందర్, ఎస్ఐ సుందరయ్య, తహసీల్దార్ జ్యోతి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు అర్జున్రావు, కంబాల పరమేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా గిరిజన దినోత్సవం
యాచారం : మండలంలోని మంథన్గౌరెల్లి, కేసీతండా, అయ్యవారిగూడ, తక్కళ్లపల్లితండా తదితర గ్రామాల్లో గిరిజన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. సంత్ సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. గ్రామపంచాయతీ సిబ్బందికి దుస్తులు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్లు విజయలక్ష్మీ, జగదీశ్, గంగాబాయి, మారు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.