ఆదిబట్ల, అక్టోబర్ 11 : కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు బాస్లు ఢిల్లీలో ఉంటే, బీఆర్ఎస్కు తెలంగాణ ప్రజలే బాస్లని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. బుధవారం ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని బొంగుళూరు ప్రమిధ గార్డెన్లో బీఆర్ఎస్ సమన్వయ కమిటీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలో ఉండే రిమోట్ కంట్రోల్తో తెలంగాణలో డ్రామాలు ఆడే కాంగ్రెస్, బీజేపీ నాయకులను గ్రామాల్లో అడుగు పెట్టకుండా చూడాలన్నారు. ఆ పార్టీలకు కేవలం పైరవీలు తప్పా ప్రజా సమస్యలు పట్టవని అన్నారు. గతంలో కాంగ్రెస్ పాలన చూశామని, నేడు పక్క రాష్ర్టాల్లో బీజేపీ పాలన చూస్తున్నామని గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సారథ్యంలో పక్క రాష్ర్టాలు అందుకోలేనంత అభివృద్ధి తెలంగాణలో జరిగిందన్నారు.
బీజేపీ నాయకులు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరంతరం ప్రజల్లో ఉండే మనకు, కేవలం ఎన్నికలప్పుడే వచ్చే పిట్టల దొరలాగా మెరిసె కాంగ్రెస్ నాయకులతో, ఆ పార్టీతో పోటీయో కాదన్నారు. రాబోయో ఎన్నికల్లో బీఆర్ఎస్ 100 సీట్లు గెలవడం ఖాయమన్నారు. కార్యకర్తలు, నాయకులు 50 రోజులు పార్టీ కోసం పని చేయాలని, మరో 5 సంవత్సరాల పాటు ప్రజల కోసం పనిచేసి మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, డీసీసీబీ జిల్లా వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, ఎంపీపీలు కృపేశ్, నర్మద, జడ్పీటీసీ జంగమ్మ, మున్సిపల్ వైస్ చైర్మన్లు ఆకుల యాదగిరి, కళమ్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ ఏర్పుల చంద్రయ్య, వైస్ చైర్మన్ రవీందర్రెడ్డి, బీఆర్ఎస్ వివిధ మండలాల అధ్యక్షులు చీరాల రమేశ్, కర్నాటి రమేశ్, బుగ్గరాములు, కిషన్గౌడ్, కార్యకర్తలు పాల్గొన్నారు.