ఇబ్రహీంపట్నం : సంపదను పెంచి పేదలకు పంచాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ (Chief Minister KCR ) ముందుకెళుతున్నారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి (MLA Kishan reddy) అన్నారు. శుక్రవారం ఇబ్రహీంపట్నంలో దివ్యాంగులకు ప్రభుత్వం రూ.4016లకు పెంచిన పింఛన్ల ప్రొసీడింగ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంగవైకల్యంతో బాధ పడకుండా వారిలో ఆత్మస్థైర్యం నింపేందుకు గాను నెలకు రూ.4016ల పింఛన్ను అందిస్తూ దివ్యాంగుల గౌరవాన్ని పెంచుతున్నారని వెల్లడించారు.
గత ప్రభుత్వాలు దివ్యాంగులకు రూ.500 మాత్రమే ఇచ్చేవారని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడిన తరువాత రూ.4016ల పింఛన్ను భారీగా పెంచి ఆదుకున్నారన్నారు. రంగారెడ్డిజిల్లాలో 2 లక్షల మంది దివ్యాంగులున్నారని, వీరికి నెలకు రూ.51 కోట్లు అందిస్తున్నారని స్పష్టం చేశారు. అన్నివర్గాల ప్రజల అభివృద్ధిని కాంక్షిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ను వచ్చే ఎన్నికల్లో పింఛన్దారులు బలపర్చాల్సిన అవసరం ఉందన్నారు.
గృహలక్ష్మి (Grihalaxmi ) పథకంలో అర్హులైన దివ్యాంగులకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. మంచాల, అబ్దుల్లాపూర్మెట్ మండలాల్లో దివ్యాంగులకు ప్రత్యేక భవనాల నిర్మాణానికి ఒక్కొక్క భవనానికి రూ.10 లక్షలు అందిస్తామని వెల్లడించారు. ఇబ్రహీంపట్నంలో నిర్మించిన దివ్యాంగుల భవనం పూర్తిచేయటానికి అదనంగా రూ.3లక్షలు అందిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి, ఇబ్రహీంపట్నం, మంచాల ఎంపీపీలు కృపేష్, నర్మద, ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్ కప్పరి స్రవంతి, వైస్చైర్మన్ ఆకుల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.