వికారాబాద్, నవంబర్ 6 : కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటువేస్తే ఆగం అవ్వడం ఖాయమని, 60 ఏండ్లు పాలించి గ్రామాలకు ఏమి చేయలేదని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని బూరాన్పల్లి, కామరెడ్డిగూడ, పాతూరు, పులుసుమామిడి, పీరంపల్లి, కొటాలగూడ గ్రామాల్లో ఎమ్మెల్యే ఆనంద్ ప్రచా రం నిర్వహించారు. ఎమ్మెల్యే ఆనంద్కు గ్రామస్తులు బ్రహ్మరథం పట్టారు.
పూలుచల్లుతూ డప్పులతో ఘన స్వాగతం పలికారు. మహిళలు బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత వికారాబాద్ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. జిల్లా ఏర్పాటు, బ్రిడ్జి నిర్మాణం, మెడికల్ కళాశాల, తదితర అభివృద్ధి పనులు జరిగాయని వివరించారు.
కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతు బంధు, 24 గంటల ఉచిత కరెంట్, మిషన్ భగీరథ నీరు, రైతు భీమా, ఆసరా పింఛన్లు వంటి తదితర పథకాలు ప్రవేశపెట్టి అభివృద్ధి చేస్తున్నామన్నారు. అభివృద్ధి పరిచే నాయకుడిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ కళ్లబొల్లి మాటలు నమ్మవద్దని, ఓటుతో వారికి తగిన గుణపాఠం చెప్పాలని తెలిపారు. నిత్యం ప్రజల్లో ఉండి సమస్యలు తెలుసు కునే నాయకుడిని గెలిపించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కమాల్రెడ్డి, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి, జిల్లా రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, ఎంపీపీ చంద్రకళాకమాల్రెడ్డి, సర్పంచ్లు మమతాసాయికృష్ణ, లలితమ్మ, రాములునాయక్, బుచ్చిరెడ్డి, తిరుపతిరెడ్డి, వెంకటేశం, మైనార్టీ మండల సెల్ అధ్యక్షుడు గయాజ్, మండల ఎస్టీసెల్ అధ్యక్షుడు మహిపాల్, పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు కవిత, నాయకులు గఫర్, అనిల్, కమాల్ రెడ్డి, నర్సింహా రెడ్డి, లక్ష్మణ్, సత్యయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.