వికారాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): వేసవిలో జిల్లాలో తాగునీటి సమస్య ఏర్పడకుండా జిల్లా యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టింది. జిల్లాలోని 566 గ్రామ పంచాయతీలు, వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీల్లో తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం రాకుండా సంబంధిత అధికారులు సమ్మర్ యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేశారు. అయితే మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయినట్లయితే వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో తాగునీటిని సరఫరా చేసేలా చర్యలు చేపట్టారు.
శ్రీశైలం బ్యాక్వాటర్ సరిపోను ఉన్న దృష్ట్యా జిల్లాకు తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం ఏర్పడదని ప్రభుత్వం అంచనాలు వేస్తున్నప్పటికీ ఒకవేళ మిషన్ భగీరథ నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడితే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తాగునీటిని అందించేందుకు అవసరమైన ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం చేసింది. ఇందులో భాగంగా మిషన్ భగీరథ పైపులైన్ల లీకేజీలకు మరమ్మతులతోపాటు కొత్త పైప్లైన్లను ఏర్పాటు చేయడం వంటి పనులను పూర్తి చేశారు.
అంతేకాకుండా మిషన్ భగీరథకు ముందు గ్రామాల్లో ఉన్న చేతిపంపులకు మరమ్మతులు చేయడంతో పాటు బోర్వెల్స్ను కూడా మరమ్మతులు చేపట్టి ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా సిద్ధంగా ఉంచారు. మిషన్ భగీరథ ద్వారా జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లోని 971 ఆవాసాలకు, 1,98,162 కుటుంబాలకు ఇంటింటికీ నల్లాల ద్వారా స్వచ్ఛమైన తాగునీటి సరఫరా జరుగుతున్నది. అయితే గతంలో ఎన్నడూ లేనివిధంగా జిల్లాలో భూగర్భజలాలు అడుగంటిపోయిన దృష్ట్యా తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. జిల్లాలో రికార్డు స్థాయిలో 13.93 అడుగులకు భూగర్భజలాలు అడుగంటిపోవడం గమనార్హం.
జిల్లాలోని 1.98 లక్షల కుటుంబాలకు సరిపోను తాగునీటిని మిషన్ భగీరథ ద్వారా అందిస్తున్నారు. అయితే జిల్లాకు రోజుకు 100 ఎంఎల్డీ తాగునీరు అవసరంకాగా, ప్రస్తుతం అవసరానికి మించి పంపింగ్ చేస్తున్నారు. పరిగి మండలం రాఘవాపూర్ ప్లాంట్తోపాటు కొడంగల్లోని మిషన్ భగీరథ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా జిల్లాలోని వికారాబాద్, తాండూరు, కొడంగల్, పరిగి నియోజకవర్గాలకు తాగునీటిని అందిస్తున్నారు. రాఘవాపూర్ ప్లాంట్ ద్వారా 135 ఎంఎల్డీ తాగునీటిని, కొడంగల్లోని ప్లాంట్ ద్వారా 17 ఎంఎల్డీ తాగునీటిని పంపింగ్ చేస్తున్నారు. జిల్లాలోని అవసరమైన తాగునీటి కంటే అదనంగా 52 ఎంఎల్డీ తాగునీటిని పంపింగ్ చేస్తున్నారు.
మరోవైపు మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని గండీడ్, మహ్మదాబాద్ మండలాలకు కూడా రాఘవాపూర్ ప్లాంట్ నుంచే తాగునీటిని సరఫరా చేస్తున్నారు. అదేవిధంగా మిషన్ భగీరథ నీటి సరఫరాలో ఏదైనా సమస్యలు ఏర్పడితే ప్రత్నామ్నాయ చర్యల్లో భాగంగా కొడంగల్ నియోజకవర్గంతోపాటు తాండూరు మున్సిపాలిటీలకు కాగ్నా నది నుంచి తాగునీటిని పంపింగ్ చేసే విధంగా జిల్లా ఉన్నతాధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. కొడంగల్ నియోజకవర్గంతోపాటు యాలాల మండలంలోని 9 గ్రామాలకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తాగునీటిని అందించేందుకుగాను 100 హెచ్పీ మోటర్లతో పంపింగ్ చేసి 2.5 ఎంఎల్డీ తాగునీటిని అందించేలా ఏర్పాట్లు చేశారు.
ఇంకా తాండూరు మున్సిపాలిటీకి కాగ్నా నది నుంచి 80 హెచ్పీ మోటర్తో పంపింగ్ చేసి 2.5 ఎంఎల్డీ తాగునీటిని సరఫరా చేసేలా ముందస్తు చర్యలు చేపట్టారు. అంతేకాకుండా కొడంగల్ నియోజకవర్గానికి తాగునీటిని అందించేందుకు పంపింగ్ చేసే 100 హెచ్పీ మోటర్ సామర్థ్యాన్ని 250 హెచ్పీ సామర్థ్యానికి పెంచేందుకు అధికారులు నిర్ణయించారు. మరోవైపు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లోనూ మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయినట్లయితే ప్రత్యామ్నాయ మార్గాల్లో భాగంగా చేతిపంపులు, బోర్వెల్స్ ద్వారా తాగునీటిని అందించేందుకుగాను చర్యలు చేపట్టారు.
ఇందుకోసం జిల్లాలోని 1044 బోర్వెల్స్, 477 చేతిపంపులకు మరమ్మతులు పూర్తి చేసి సిద్ధం చేశారు. మరోవైపు పశువులకు కూడా తాగునీటిని అందించేందుకు జిల్లావ్యాప్తంగా 432 పశువుల తొట్టెలను అందుబాటులోకి తీసుకురావడంతోపాటు మిగతా వాటికి మరమ్మతులు చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అయితే సమ్మర్ యాక్షన్ ప్లాన్కుగాను జిల్లాలో 11.50 కోట్ల నిధులను జిల్లా ఉన్నతాధికారులు అందుబాటులో ఉంచారు. వీటిలో ప్రత్యేక అభివృద్ధి నిధుల నుంచి రూ.6.50 కోట్లు, డీఎంఎఫ్టీ నుంచి రూ.3.50 కోట్లు, 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.1.50 కోట్లను తాగునీటి అవసరాలకు వినియోగించేందుకుగాను జిల్లా యంత్రాంగం అందుబాటులో ఉంచింది.
జిల్లాలో తాగునీటి కొరత లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. మిషన్ భగీరథ ద్వారా జిల్లాకు అవసరానికి మించి నీటిని పంపింగ్ చేస్తున్నాం. మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని గండీడ్, మహ్మదాబాద్ మండలాలకు కూడా ఇక్కడి నుంచి నీరందిస్తున్నాం. మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోతే వెంటనే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీరు సరఫరా చేసేందుకు ముందస్తు చర్యలు చేపట్టాం. చేతిపంపులు, బోర్వెల్స్కు మరమ్మతులు చేశాం.
– కలెక్టర్ సి.నారాయణ రెడ్డి