వికారాబాద్, జూలై 25 : ముందస్తు జాగ్రత్తలతో డెంగ్యూ, మలేరియా, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా, నియంత్రణకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి సంబంధిత శాఖల మంత్రులతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్య నిర్వహణ కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని, డెంగ్యూ, మలేరియా కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ అధికారులు సమన్వయంతో పని చేసి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి శుక్రవారం జిల్లాలోని గ్రామాలు, ఆదివారం పట్టణాల్లో ఇంటింటికీ ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. దోమల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు వివరించాలని, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను ఇందులో భాగస్వామ్యం చేయాలన్నారు. డెంగ్యూ, మలేరియా కేసులపై ప్రభుత్వ దవాఖానల్లో చికిత్స చేయడానికి అవసరమైన అన్ని వసతులు కల్పిస్తున్నామన్నారు.
వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి
జిల్లాలో డెంగ్యూ, మలేరియా, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో డెంగ్యూ, మలేరియా సీజనల్ వ్యాధులు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో, హాస్టళ్లలో ఆహార భద్రత, కొవిడ్ టీకా, బూస్టర్ డోస్ వేసేందుకు తగు చర్యలపై ప్రత్యేక అధికారులు మున్సిపల్ కమిషనర్, ఎంపీడీవోలు, ఎంపీవోలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ.. జిల్లా యంత్రాంగం ఇంటింటికీ సర్వే నిర్వహించి జ్వరాల బారిన పడిన వ్యక్తులను గుర్తించి వైద్య సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు. గ్రామాల్లో ఆరోగ్య, పారిశుధ్య కమిటీలను ఏర్పాటు చేసి ప్రజలకు సీజనల్ వ్యాధులు, పారిశుధ్యంపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.
గ్రామస్థాయిలో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ఏఎన్ఎం, ఆశా, అంగన్వాడీ వర్కర్లు, వార్డు సభ్యులతోపాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులతో కలిసి గ్రామ కమిటీలను ఏర్పాటు చేసి సమన్వయంతో పని చేయాలన్నారు. మండల స్థాయిలో ప్రత్యేక అధికారి, ఎంపీడీవో, ఏంపీవో, ఏపీవో, సూపరింటెండెంట్ స్థాయి అధికారులతో కలిపి కమిటీలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. గ్రామ, మండల స్థాయిల్లో ఏర్పాటు చేసిన ఆరోగ్యం, పారిశుధ్య కమిటీలు మంగళవారం నుంచి ఉదయం 8 గంటల నుంచి గ్రామాలను సందర్శించి, చేపట్టిన పనులను ఐదు రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంటింటికీ సర్వే చేస్తున్న వైద్య సిబ్బంది కొవిడ్ వ్యాక్సినేషన్ 100 శాతం పూర్తయ్యేలా చూడాలని పేర్కొన్నారు. ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ ప్రస్తుత సమయంలో కాచి చల్లార్చిన నీటిని తాగాలని వివరించారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో కూడా ఆరోగ్య, పారిశుధ్య కమిటీలను ఏర్పాటు చేసి ప్రతి వార్డులో పారిశుధ్య పనులు చేపడుతూ.. చెత్తాచెదారం లేకుండా, పిచ్చి మొక్కలను తొలగించాలని కమిషనర్లకు సూచించారు. శానిటేషన్ పనులు చేపడుతూనే వ్యాక్సినేషన్ చేసిన ప్రక్రియను కూడా పూర్తి చేయాలన్నారు. ప్రత్యేక అధికారులు కమిటీ సభ్యులతో కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. సమావేశంలో జడ్పీ సీఈవో జానకీరెడ్డి, ఇన్చార్జి డీఆర్వో విజయకుమారి, డీఎంహెచ్వో తుకారాం, డీపీవో మల్లారెడ్డి, గిరిజన అభివృద్ధి అధికారి కోఠాజీ, షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి మల్లేశం, బీసీ అభివృద్ధి అధికారి ఉపేందర్, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
పాఠశాలలకు షోకాజు నోటీసులు
ఇబ్రహీంపట్నం, జూలై 25 : రంగారెడ్డిజిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా సెలవు రోజుల్లో నడిపిన పలు ప్రైవేటు పాఠశాలలకు జిల్లా విద్యాధికారి సుశేందర్రావు సోమవారం నోటీసులు జారీ చేశారు. బోనాల పండుగను పురస్కరించుకుని ప్రభుత్వం సోమవారం జంటనగరాలతోపాటు రంగారెడ్డిజిల్లాలో కూడా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులను ప్రకటించింది. కానీ, ప్రభుత్వ ఉత్తర్వులను బేఖాతర్ చేస్తూ జిల్లాలోని పలు ప్రైవేటు పాఠశాలలు సోమవారం సెలవు ఉన్నప్పటికీ నిర్వహించారు. సెలవు రోజుల్లో పాఠశాలను నిర్వహించినందుకు నగర శివారుల్లోని అక్షర, నారాయణకు చెందిన రెండు పాఠశాలలు, శ్రీచైతన్య పాఠశాలలకు షోకాజు నోటీసులు జారీచేశారు. షోకాజు నోటీసులపై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని.. లేకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని ఆదేశాలు జారీ చేశారు.