షాబాద్ : రాష్ట్ర ప్రజలందరికీ కొవిడ్ వ్యాక్సిన్ వేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నట్లు మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. అదే విధంగా తుక్కుగూడ మునిసిపాలిటీలోని రావిర్యాలలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలందరికీ ఇబ్బందులు లేకుండా వ్యాక్సినేషన్ అందాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద ఎత్తున ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసిన్నట్లు స్పష్టం చేశారు.
18 ఏళ్లు పై బడిన వారందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. కరోనా నుంచి రక్షణ పొందాలంటే 100శాతం వ్యాక్సినేషన్ కార్యక్రమం జరగాలన్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. కార్పొరేషన్ల పరిధిలోని అన్ని డివిజన్లలో పెద్ద ఎత్తున వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాలకు కార్పొరేటర్లు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. కార్యక్రమంలో మేయర్ పారిజాత నర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రహీంశేఖర్, తుక్కుగూడ మునిసిపాలిటీ చైర్మన్ మధుమోహన్, వైస్ చైర్మన్ భవానివెంకట్రెడ్డి, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.