వికారాబాద్/ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 3 : గ్రామపంచాయతీల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ప్రత్యేక అధికారుల పాలన ద్వారా అమలు చేయనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. శనివారం ములుగు జిల్లా కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైదరాబాద్ నుంచి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పంచాయతీ, గ్రామీణాభివృద్ధి అధికారులు, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, ఇందులో భాగంగా ప్రత్యేక అధికారుల పాలన ద్వారా చర్యలు తీసుకుంటుందన్నారు. రానున్న వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చూస్తామన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సమర్థవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 1వ తేదీన సర్పంచ్ల పదవీకాలం ముగిసినందున జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలలో ఈ నెల 2వ తేదీ నుంచి ప్రత్యేక అధికారులు బాధ్యతలు తీసుకున్నారన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి జిల్లా స్థాయి, మండల స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తామన్నారు.
గ్రామ పంచాయతీలలో పంచాయతీ కార్యదర్శులను సిబ్బందితో సమన్వయం చేసుకొని పనిచేసేలా ప్రత్యేక అధికారులకు బాధ్యతలు ఇచ్చినట్లు తెలిపారు. వేసవిలో తాగునీటికి ఇబ్బందులు రాకుండా ‘మిషన్ భగీరథ’తో తాగునీటి సరఫరా చేయాలన్నారు. ఉపాధి హామీ పథకం కింద మంజూరైన పనులను వెంటనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
తాగునీరు, పారిశుధ్యం, నర్సరీల నిర్వహణ, మొక్కల సంరక్షణ, డంపింగ్ యార్డు నిర్వహణ, వైకుంఠ ధామాల అభివృద్ధిపై సంబంధిత అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ఈనెల 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు గ్రామపంచాయతీలలో పారిశుధ్యంపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, జడ్పీ సీఈవో జానకిరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కృష్ణన్ పాల్గొన్నారు.
మంత్రి వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ శశాంక సంబంధిత అధికారులతో మాట్లాడుతూ జిల్లాలోని 558 స్పెషల్ ఆఫీసర్లకు ఒక్కరోజు ఓరియెంటేషన్ నిర్వహించడానికి సన్నాహాలు త్వరగా చేయాలన్నారు. స్పెషల్ ఆఫీసర్లు, గ్రామ పారిశుధ్య కార్మికులు, యువతను భాగస్వామ్యం చేస్తూ సమావేశాలు నిర్వహించాలన్నారు. వారం రోజులు టెస్ట్డ్రైవ్ను నిర్వహించడానికి ప్రణాళిక రూపొందించాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా అనదపు కలెక్టర్ ప్రతిమాసింగ్, జడ్పీ సీఈవో దిలీప్కుమార్, డీఆర్డీవో పీడీ ప్రభాకర్, పంచాయతీరాజ్ ఇంజినీర్లు, అధికారులు పాల్గొన్నారు.