రంగారెడ్డి, జూన్ 6 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు రంగారెడ్డి జిల్లాలో అంగ రంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు జిల్లా వ్యాప్తంగా పారిశ్రామిక ప్రగతి ఉత్సవం కనుల పండువగా కొనసాగింది. జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో కొనసాగిన ఈ వేడుకలు శేరి లింగంపల్లి, ఎల్బీ నగర్లోని ఆటోనగర్, మహేశ్వరంలోని ఫ్యాబ్ సిటీ, షాద్నగర్ పరిధిలోని కొత్తూరు, రాజేంద్రనగర్లోని కాటేదాన్, చేవెళ్ల పరిధిలోని చందన్వెల్లిలో జరిగాయి. ఆయా ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, సుధీర్రెడ్డి, ప్రకాశ్ గౌడ్, అంజయ్య యాదవ్, కాలె యాదయ్య, జిల్లాలోని పారిశ్రామికవేత్తలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, అనధికారులు వేలాదిగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేడుకల్లో విద్యా శాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి, కలెక్టర్ హరీశ్, అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో లక్షలాది మందికి ఉపాధి కల్పించే పరిశ్రమల పండుగ ఇది కావడంతో ప్రజలు ఈ వేడుకలో పెద్ద భాగస్వాములయ్యారు. స్వచ్ఛందంగా ఉద్యోగులు, నిరుద్యోగులు, స్థానికులు, ఔత్సాహికులు, పారిశ్రామిక ఉత్పత్తులపై ఆసక్తి గలవారు మొదలైన వారు వేలాదిగా పండుగలో పాల్గొని కార్యక్రమాలకు ఊతం అందించారు.
ఉత్సవంలో భాగంగా పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి పలు అంశాలపై జిల్లా పరిశ్రమల అధికారులు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పించారు. క్రమబద్ధమైన అనుమతులు, తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అనుమతులు, స్వీయ ధ్రువీకరణ విధాన చట్టం – 2014 (టీఎస్ ఐ పాస్) చట్టం, టీఎస్ ఐ పాస్ చట్టం ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్వీయ ధ్రువీకరణ, సులభతర వ్యాపారాన్ని ప్రోత్సహించడం, పెట్టుబడిదారులకు స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టించడం ద్వారా పరిశ్రమల స్థాపనకు ఒకే చోట వివిధ అనుమతులు ఎలా పొందాలి తదితర అంశాలను వివరించారు. రాష్ట్ర పారిశ్రామిక షెడ్లు, రోడ్లు, నీటి సరఫరా, ఇతర అవసరమైన సౌకర్యాలు, అధునాతన మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక పార్కుల అభివృద్ధి, ఇంకా పలు అంశాలపై ఆసక్తి గలవారికి సందేహాలను నివృత్తి చేశారు.
“టీఎస్ ఐ పాస్ ప్రవేశపెట్టిన తరువాత రంగారెడ్డి జిల్లాలో 1,715 పారిశ్రామిక యూనిట్ల స్థాపనకు అనుమతులు లభించాయి. ఈ యూనిట్లకు రూ.80217.08 కోట్ల పెట్టుబడులను పెట్టి 9,75,979 మందికి ఉపాధి అవకాశాలు కల్పించాయి. వాటిలో 1252 పరిశ్రమలు రూ.47,062.20 కోట్ల పెట్టుబడితో కార్యకలాపాలు ప్రారంభించి 5,15,851 మందికి ఉపాధి కల్పించాయి.” తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రంగారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే అత్యధిక పెట్టుబడులు (32.15%), ఇంకా ఉపాధిని (56.66%) పొందింది. 2014 నుంచి 2023 మధ్య కాలంలో పారిశ్రామిక యూనిట్ల శాతం 45%, పారిశ్రామిక పెట్టుబడులు 14 రెట్లు, పారిశ్రామిక ఉపాధి 11 రెట్లు పెరిగాయి.
జిల్లాలో ప్రత్యేకంగా సేవలు అందించిన పలు పరిశ్రమలకు కలెక్టర్ హరీశ్ మహేశ్వరంలో అవార్డులను అందజేశారు. వారు చేసిన సేవలను కొనియాడి ఆ సంస్థలకు జ్ఙాపికను అందజేసి ధ్రువపత్రాన్ని అందించారు. అవార్డులు పొందిన పరిశ్రమలు ఇలా ఉన్నాయి.