పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన ప్రగతిని ప్రజల ముందుంచేలా దశాబ్ది ఉత్సవాలను నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశమందిరంలో ఉత్సవ ఏర్పాట్లపై అధికారులు, ప్రజాప్రతినిధులతో ఆమె సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 21 రోజులపాటు జరిగే సంబురాల్లో అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు. అందుకోసం ఊరూరా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతిష్టాత్మకమైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో యావత్ దేశం ఆశ్చర్యపోయేలా రాష్ట్రం అనేక రంగాల్లో ప్రగతిని సాధించిందన్నారు. ప్రభుత్వ పథకం అందని ఇల్లంటూ లేదన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పరస్పర సహకారంతో పనిచేసి దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు.
-రంగారెడ్డి, మే 29 (నమస్తే తెలంగాణ)/ ఇబ్రహీంపట్నం
రంగారెడ్డి, మే 29 (నమస్తే తెలంగాణ)/ఇబ్రహీంపట్నం, మే 29 : ఏర్పడిన అనతి కాలంలోనే తెలంగాణ సాధించిన ప్రగతిని ప్రజల ముందుంచేలా తెలంగాణ రాష్ట్ర ఆవతరణ దశాబ్ది ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం రంగారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ఆమె సమావేశమై వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఉత్సవాల్లో అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేసి.. ఊరూరా తెలంగాణ ప్రగతిని ఆవిష్కరింపజేయాలన్నారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ఏర్పడిన తొమ్మిదేండ్ల కాలంలోనే యావత్ దేశం ఆశ్చర్యపోయేలా అన్ని రంగాల్లో అద్భుత ప్రగతిని సాధించిందని కొనియాడారు. తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగంలోనూ మన రాష్ట్రమే దేశంలోనే నంబర్వన్ స్థానంలో ఉం దన్నారు. కొవిడ్ సంక్షోభ సమయంలోనూ తెలంగాణ వృద్ధి రేటు నాలుగు శాతం పెరిగిందని వివరించారు. సీఎం కేసీఆర్ జనరంజక పాలనతో అన్ని వర్గాల ప్రజలకు విశేషంగా లబ్ధి చేకూరుతుందన్నారు. ఇంటింటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని.. పల్లెలు, పట్టణాలు అని తేడా లేకుండా అభివృద్ధి జరుగుతున్నదన్నారు. దేశంలో కేవలం మూడు శాతం జనాభా కలిగిన తెలంగాణకు జాతీయస్థాయిలో వరుసబెట్టి 36 శాతం మేర అభివృద్ధి అంశాల్లో అవార్డులు వరించడం ప్రభుత్వ సుపరిపాలనకు.. ముఖ్యమంత్రి పాలన దక్షతకు అద్దం పడుతుందన్నారు.
‘పాలమూరు-రంగారెడ్డి’ పూర్తికి సీఎం కృషి
విద్యాభివృద్ధికి జరుగుతున్న కృషిని, ‘మన ఊరు-మనబడి’ క్రింద పాఠశాలల్లో వచ్చిన మార్పును నాడు-నేడు ఫొటోలతో ప్రదర్శించాలని మంత్రి సబితారెడ్డి అధికారులకు సూచించా రు. గురుకుల, సంక్షేమ ఇతర పాఠశాలల వివరాలను ఇవ్వాల న్నారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో జాతీయస్థాయి అవార్డులు సాధించి తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. కాళేశ్వరం మాదిరిగా ‘పాలమూరు-రంగారెడ్డి’ని కూడా పూర్తిచేసి ఈ ప్రాంతానికి తాగు, సాగు నీరు తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రం వస్తే చీకటి అవుతుందని చెప్పి న చోటే నేడు వెలుగులు ప్రసరిస్తున్నాయని.. తొమ్మిదేండ్లలో సాధించిన ప్రగతిని గర్వంగా ప్రజలకు వివరించాలన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతోపాటు గ్రామాల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలన్నారు. కులవృత్తులకు ప్రభుత్వం రూ.లక్ష ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించిన విషయాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలన్నారు. తొమ్మిదేండ్లలో సాధించిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు.. వివిధ వర్గాల ప్రజలకు జరిగిన మేలును శాఖల వారీగా కరపత్రాలు, ఫ్లెక్సీ లు, బుక్లెట్ల ద్వారా తెలియజేయాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా వ్యవసాయం, విద్యుత్, సాగునీరు, పారిశ్రామిక ప్రగతి, విద్యావైద్యం, సంక్షేమం, ఐటీ రంగాల్లో సాధించిన ప్రగతిని వివరించాలన్నారు. అనంతరం కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్సీలు వాణీదేవి, దయానంద్, ఎగ్గే మల్లేశ్, ఎమ్మెల్యేలు సుధీర్రెడ్డి, కాలె యాదయ్య, మంచిరెడ్డి కిషన్రెడ్డి, అరెకపూడి గాంధీ, అంజయ్యయాదవ్, జైపాల్యాదవ్, అదనపు కలెక్టర్లు ప్రతీక్జైన్, తిరుపతిరావు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
సాధించిన ప్రగతిని చూసి ప్రపంచమే అబ్బురపడుతున్నది..
ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో సాగు రంగం ఐదింతలు పెరిగిందని మంత్రి తెలిపారు. 2014 వరకు కేవలం 16 లక్షల ఎకరాల్లో మాత్రమే రాష్ట్రవ్యాప్తంగా వరి పంట సాగయ్యేదని, ప్రస్తుతం పంటల పెట్టుబడి, ఉచిత విద్యుత్, సాగు నీటి వసతి కల్పించటంతో 56 లక్షల ఎకరాల్లో వరి సాగవుతున్నట్లు వివరించారు. వరి సాగులో పంజాబ్ రాష్ర్టా న్నీ అధిగమిస్తూ.. దేశం మొత్తంలో యాభై శాతం ధాన్యాన్ని తెలంగాణ రాష్ట్రమే సాగుచేసే స్థాయికి ఎదిగిందన్నారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, యాదగిరిగుట్ట ఆలయం, పోలీస్ కమాండ్ కంట్రోల్ భవ నం, ఐటీహబ్, కేబుల్ బ్రిడ్జిలు, ఫ్లైఓవర్లు, రాజ్యాంగ నిర్మా త అంబేద్కర్ విగ్రహం, నూతన సచివాలయ నిర్మాణం, అమరవీరుల స్మారక చిహ్నం వంటి అనేక ప్రఖ్యాత కట్టడాలను అనతి కాలంలోనే పూర్తి చేసుకోవడాన్ని చూసి ప్రపంచమే అబ్బురపడుతున్నదన్నారు. ఇటీవలే రంగారెడ్డి జిల్లా లో ప్రపంచ దిగ్గజ ఫాక్స్కాన్ కంపెనీ ఏర్పాటుకు భూమిపూజ జరిగిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు.
జూన్ 2న అవతరణ వేడుకలు
జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం ఉంటుందని, 3న అన్ని రైతువేదికల్లో రైతుదినోత్సవ నిర్వహణ, 4న పోలీసుశాఖ ఆధ్వర్యంలో సురక్షా దివస్, 5న విద్యుత్ విజయోత్సవం, 6న పారిశ్రామిక ప్రగతి ఉత్సవం, 7న సాగు నీటి దినోత్సవం, 8న ఊరూరా చెరువుల పండుగ, 9న తెలంగాణ సంక్షేమ సంబురాలు, 10న తెలంగాణ సుపరిపాలన దినోత్సవం, 11న సాహిత్య దినోత్సవం, 12న తెలంగాణ రన్, 13న మహిళా సంక్షేమ దినోత్సవం, 14న తెలంగాణ వైద్యారోగ్య దినోత్స వం, 15న పల్లెప్రగతి దినోత్సవం, 16న పట్టణ ప్రగతి దినోత్సవం, 17న తెలంగాణ గిరిజనోత్సవం, 18న తెలంగాణ మంచినీళ్ల పండుగ, 19న తెలంగాణ హరితోత్సవం, 20న తెలంగాణ విద్యాదినోత్సవంలో భాగంగా స్కూళ్లు, కాలేజీల్లో జెండాలను ఆవిష్కరించడంతోపాటు విద్యాలయాలను అందంగా ముస్తాబు చేయడం, విద్యార్థులకు బుక్స్, యూనిఫా మ్స్ పంపిణీ, వ్యాసరచన, చిత్రలేఖనం వంటి పోటీలను నిర్వహించాలన్నారు.
‘మన ఊరు-మనబడి’ క్రింద పూర్తైన స్కూళ్లను ప్రజాప్రతినిధులతో ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. 21న తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా ఆలయాలు, మసీదు లు, చర్చిలు, గురుద్వారాలను అందంగా అలంకరించి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, 22న అమరవీరులకు సంస్మరణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.