దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వైద్యారోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పలుచోట్ల గర్భిణులు, బాలింతలకు న్యూట్రిషన్, కేసీఆర్ కిట్లను అందజేశారు. ప్రజాప్రతినిధులు వైద్యారోగ్య సిబ్బందిని ఘనంగా సన్మానించి వారి సేవలను కొనియాడారు. మహేశ్వరం నియోజకవర్గంలోని జిల్లెలగూడలో జరిగిన వేడుకల్లో మంత్రి సబితారెడ్డి పాల్గొని గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లు అందజేశారు. అలాగే పరిగిలో ఎంపీ రంజిత్రెడ్డి, షాద్నగర్లో ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి వేడుకలకు హాజరుకాగా, ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఉత్సవాలు జరిగాయి.
-న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ
బడంగ్పేట, జూన్ 14 : పైసా ఖర్చు లేకుండా పేదలకు ప్రభుత్వం నాణ్యమైన వైద్యం అందిస్తున్నదని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లెలగూడలో తెలంగాణ వైద్య, ఆరోగ్య దినోత్సవ కార్యక్రమాన్ని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్రావు అధ్యక్షతన నిర్వహించారు. మంత్రి సబితారెడ్డి జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, కలెక్టర్ హరీశ్, కేంద్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీధర్ తదితరులతో కలిసి జ్యోతి ప్రజల్వన చేశారు. గర్భిణులు, బాలింతలకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను, వైద్య రంగంలో ఉత్తమ సేవలందించిన వారికి మంత్రి ప్రశంసాపత్రాలను అందజేశారు. వైద్యశాఖ రూపొందించిన వాల్ పోస్టర్ను మంత్రి ఆవిష్కరించారు.
సౌకర్యాల కల్పనలో రాష్ట్రం మొదటి స్థానం
ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పేదలకు ఉచితంగా ఖరీదైన వైద్యం అందిస్తున్నారన్నారు. నీతి ఆయోగ్ సర్వేలో రాష్ట్రం మూడో స్థానంలో, సౌకర్యాల కల్పనలో మొదటి స్థానంలో ఉందన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలందిస్తున్న డాక్టర్లు కనిపించని దేవుళ్లన్నారు. అమ్మకు అండగా ప్రభుత్వం నిలుస్తున్నదన్నారు. అంగన్వాడీ టీచర్లు, ఆశావర్కర్లు, నర్సుల సేవలు మరువలేనివన్నారు. ఉచిత వైద్యం అందరికి పండుగలా మారిందన్నారు. కేసీఆర్ కిట్తోపాటు అబ్బాయి పుడితే రూ. 12వేలు, అమ్మాయి పుడితే రూ.13వేలు ఇస్తున్నారన్నారు. ఉచితంగా 57 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారన్నారు.
సీపీఆర్పై అవగాహన
అమ్మఒడి వాహనాలు, బస్తీ దవాఖానలతో వైద్య సేవలందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటివరకు 500 బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇటీవల కాలంలో 35 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉన్నవారు గుండెపోటుతో మరణిస్తున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. వారి ప్రాణాలను కాపాడటానికి సీపీఆర్పై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తున్నారన్నారు. గర్భిణుల్లో రక్తహీనత సమస్యను దూరం చేయడానికి న్యూట్రిషన్ కిట్లను అందిస్తున్నామన్నారు. మెడికల్ సీట్లు భారీగా పెరిగాయన్నారు. పేదలైన బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారన్నారు. ప్రభుత్వం అమ్మగా ఇంటి పాత్రను పోషిస్తున్నదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప మానవతావాది అని మంత్రి కొనియాడారు. కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి సుశీందర్రావు, ఆర్డీవో సూరజ్ కుమార్, మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్, ఎంపీపీ రఘుమారెడ్డి, జడ్పీటీసీ జంగారెడ్డి, ఎంఈవో కృష్ణయ్య, మాజీ ఎంపీపీ లావణ్య, కార్పొరేటర్లు, పలు శాఖల అధికారులు, వైద్యాధికారులు, సిబ్బంది, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
బడ్జెట్లో వైద్య రంగానికి రూ.12వేల కోట్లు కేటాయింపు
పరిగి, జూన్ 14 : వైద్య సేవల రంగంలో దేశంలోనే తెలంగాణ రాష్ర్టానికి మూడో స్థానం దక్కిందని చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు డాక్టర్ జి.రంజిత్రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం పరిగిలో జరిగిన వైద్యారోగ్య దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ రంజిత్రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు వైద్య సేవల రంగాన్ని విస్తరించేందుకు చేసిన కృషితో పేదలకు మరింత మెరుగైన వైద్యం అందుతున్నదన్నారు. రాబోయే రోజుల్లో అద్భుతాలు చూడబోతున్నారని ఎంపీ చెప్పారు. ఇటీవల నీతి ఆయోగ్ ప్రకటించిన ర్యాంకుల్లో వైద్య సేవల రంగంలో తెలంగాణ మూడో స్థానం దక్కించుకోగా, కాంగ్రెస్ పాలిత రాజస్థాన్ 16వ స్థానం, బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ చివరి స్థానంలో ఉన్నాయని తెలిపారు.
వైద్య, ఆరోగ్య శాఖకు రూ.12వేల కోట్లు కేటాయింపు
కేంద్రం దేశంలో 150 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయగా తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదని ఎంపీ విమర్శించారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తుండడంతో రాష్ట్రంలో 5వేల మెడికల్ సీట్లు అందుబాటులోకి రానున్నాయని ఎంపీ వెల్లడించారు. గతంలో వైద్య, ఆరోగ్య శాఖకు బడ్జెట్లో రూ.5వేల కోట్లు కేటాయిస్తే సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం రూ.12వేల కోట్లు కేటాయించిందని తెలిపారు. గత ప్రభుత్వాలు ఒక్క సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం కూడా చేపట్టలేదని, తెలంగాణ ఏర్పాటు తర్వాత వరంగల్లో 2016 పడకలతో ఎంజీఎం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం జరుగుతున్నదని, హైదరాబాద్లోని నిమ్స్లో 2100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారని ఎంపీ పేర్కొన్నారు.
ప్రతి మంగళవారం ‘ఆరోగ్య మహిళ’
మహిళల కోసం ప్రత్యేకంగా ప్రతి మంగళవారం ఆరోగ్య మహిళ అనే కార్యక్రమం చేపట్టి ఎనిమిది రకాల వ్యాధుల నిర్ధారణ పరీక్షలతోపాటు చికిత్సలు అందించనున్నట్లు ఎంపీ రంజిత్రెడ్డి చెప్పారు. కంటి వెలుగు కార్యక్రమంలో కోటీ50లక్షల మందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడంతోపాటు 40లక్షల మందికి కండ్లద్దాలు అందించినట్లు ఎంపీ తెలిపారు. డయాలసిస్ సెంటర్లను 105కు పెంచినట్లు, బస్తీ దవాఖానలతో గడపగడపకు వైద్యసేవలు అందనున్నాయన్నారు. నాడు.. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు, నేడు.. నేను పోను బిడ్డో ప్రైవేటు దవాఖానకు అనే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎమ్మెల్యే మహేశ్రెడ్డి ప్రత్యేక కృషితో పరిగి ఆసుపత్రికి డయాలసిస్ సెంటర్ మంజూరైందని ఎంపీ చెప్పారు.
ప్రతిరోజూ 20 నుంచి 25 మందికి డయాలసిస్
ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు తర్వాత పరిగిలో 50 పడకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టడంతోపాటు అన్ని వైద్యసేవలు అందుబాటులోకి వచ్చినట్లు చెప్పారు. ఇటీవలే డయాలసిస్ సెంటర్ ప్రారంభంతో ప్రతిరోజూ 20 నుంచి 25 మందికి డయాలసిస్ సేవలు అందుతున్నాయని, వారికి ప్రభుత్వం పింఛన్ ఇవ్వడంతోపాటు బస్పాస్ సదుపాయం కల్పించిందన్నారు. జిల్లాలో ఎన్సీడీ కార్యక్రమం చేపట్టి దీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం, రక్తపోటు తదితర వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులు అందిస్తున్నట్లు చెప్పారు. పరిగి నియోజకవర్గానికి చెందినవారు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుంటే సీఎంఆర్ఎఫ్ కింద రూ.23కోట్లు ప్రభుత్వం అందించిందని, వైద్య చికిత్సలకు రూ.5కోట్ల ఎల్వోసీలు ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా సర్కారు దవాఖానలను తీర్చిదిద్దనున్నట్లు, నియోజకవర్గంలో 2200 మందికి కేసీఆర్ కిట్లు అందజేసినట్లు తెలిపారు. లక్షా 54వేల మందికి కంటివెలుగు ద్వారా ఉచితంగా కంటి పరీక్షలు జరిపించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
70 శాతం ప్రసవాలు సర్కారు దవాఖానల్లోనే..
కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. కరోనా సమయంలో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు అందించిన సేవలు గొప్పవన్నారు. భయాన్ని లెక్క చేయకుండా వారు పనిచేశారని కొనియాడారు. ఆరోగ్యానికి ఉన్న విలువ చాలా గొప్పదని కలెక్టర్ చెప్పారు. గ్రామస్థాయి నుంచి సూపర్ స్పెషాలిటీ స్థాయి వైద్య సేవల కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని పేర్కొన్నారు. జిల్లాలో 70 శాతం ప్రసవాలు సర్కారు దవాఖానల్లో జరుగుతున్నాయని తెలిపారు. వికారాబాద్లో మెడికల్ కళాశాలలో ఈసారి నుంచే వైద్య విద్య అందుబాటులోకి వస్తుందన్నారు.
తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్ ద్వారా 57 రకాల పరీక్షలు నిర్వహిస్తుండగా బుధవారం నుంచి 134 పరీక్షలు అందుబాటులోకి రానున్నాయని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లను ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్ తిలకించారు. ఉత్తమ సేవలందించిన డాక్టర్లు, వైద్య సిబ్బందిని సన్మానించి ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ పాల్వన్కుమార్, జిల్లా పంచాయతీ అధికారి తరుణ్కుమార్, ఎంపీపీలు అరవిందరావు, మల్లేశం, సత్యమ్మ, అనుసూజ, జడ్పీటీసీలు హరిప్రియ, మేఘమాల, నాగారెడ్డి, రాందాస్నాయక్, శ్రీనివాస్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, అధికారులు, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
బస్తీ దవాఖాన ప్రారంభం
పరిగి మున్సిపల్ పరిధి ఎర్రగడ్డపల్లిలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను ఎంపీ ఎమ్మెల్యే, కలెక్టర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే బీపీ చెక్ చేయించుకున్నారు.అనంతరం వారిని మున్సిపల్ చైర్మన్ అశోక్ సన్మానించారు.
ఉచిత అంబులెన్స్ సేవలను ప్రారంభించిన ఎంపీ
పరిగి పట్టణానికి చెందిన రాజు అనే యువకుడు ఉచితంగా సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన అంబులెన్స్ను బుధవారం ఎమ్మెల్యే, కలెక్టర్తో కలిసి ఎంపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజును వారు అభినందించారు.
ప్రైవేట్ దవాఖానలను మరిపించేలా..
షాద్నగర్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రైవేట్ దవాఖానలను మరిపించేలా ప్రజలకు సర్కారు వైద్యం అందుతున్నదని ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం షాద్నగర్లో వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆరోగ్య దినోత్సవంలో వారు పాల్గొని మాట్లాడారు. ఉమ్మడి పాలనలో మేము పోము సర్కారు దవాఖానకు అనే పాటలు పాడుకున్న ఈ తెలంగాణ ప్రాంత పేద ప్రజలు.. నేడు సర్కారు దవాఖానల్లో సకల వసతులతో నాణ్యమైన వైద్యం అందుతున్నదనే విషయాన్ని ప్రజలే స్వయంగా చెపుతున్నారన్నారు. గ్రామీణ ప్రాంతాల పేద ప్రజలకు ఉచితంగా బీపీ, షుగర్, క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ పరీక్షలతో పాటు మందులను అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ది అని కొనియాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ పథకాలను అమలవుతున్నాయన్నారు.
రూ.21 కోట్లతో 100 పడకల దవాఖాన
షాద్నగర్ నియోజకవర్గంలో రూ.21కోట్ల నిధులతో 100 పడకల దవాఖాన నిర్మాణమవుతున్నదని, రూ.60లక్షల నిధులతో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఆరు పీహెచ్సీలతోపాటు 33 పల్లె దవాఖానలు అందుబాటులోకి వచ్చాయని, ఇప్పటికే నియోజకవర్గంలో 8,730 కేసీఆర్ కిట్లను ఇచ్చామని చెప్పారు. కంటి వెలుగు పథకం ద్వారా 1,21,789 మందికి ఉచితంగా కంటి పరీక్షలు చేసి మందులను అందజేశామన్నారు.
ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు న్యూట్రిషన్ కిట్లను అందజేశారు. సర్కారు దవాఖానలో రోగులకు పండ్లు, పాలను పంపిణీ చేశారు. ఆరోగ్య దినోత్సవ ప్రాంగణంలో వైద్య సిబ్బంది బతుకమ్మలను ఆడి తెలంగాణ సంస్కృతిని చాటారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ గణేశ్, ఎంపీపీ ఖాజా ఇద్రీస్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, విశాల, శ్రీలత, మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజన్, మున్సిపల్ కమిషనర్ వెంకన్న, ఎంపీడీవో డా.వినయ్కుమార్, ఏడీఎంహెచ్వో డా.జయలక్ష్మి, సర్కారు దవాఖాన సూపరింటెండెంట్ డా.శ్రీనివాస్రెడ్డి, వైద్యుడు శ్రీనివాస్గౌడ్, వైద్య సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లాలో న్యూట్రిషన్ కిట్ల పంపిణీ షురూ..
తల్లీబిడ్డల సంరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకెళ్తున్నది. ఇప్పటికే పలు జిల్లాల్లో గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లు అందజేస్తుండగా బుధవారం రంగారెడ్డి జిల్లాలో న్యూట్రిషన్ కిట్ల పంపిణీ షురూ అయ్యింది. జిల్లా వ్యాప్తంగా 3495 మంది గర్బిణులను గుర్తించిన వైద్యారోగ్యశాఖ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఇక నుంచి జిల్లాలో అధికారులు నిరంతరాయంగా గర్భిణులకు పోషకాహార కిట్లు అందజేయనున్నారు. తల్లీబిడ్డల సంరక్షణ కోసం ప్రభుత్వం ఈ కిట్లను అందజేస్తున్నది. అందులో హార్లిక్స్, న్యూట్రిషన్మిక్స్ పౌడర్, ఐరన్ సిరప్లు 3, ఖర్జూరాలు 1కిలో, పల్లిపట్టీలు, 500మిల్లీ లీటర్ల నెయ్యి ఉంటాయి.
-ఇబ్రహీంపట్నం, జూన్ 14