తెలంగాణ సర్కార్ నిరుపేదలకు సొంతిండ్లను కానుకగా ఇవ్వగా.. లబ్ధిదారుల కండ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. ఎన్నో ఏండ్లుగా సంపాదనలో సగం ఇంటి కిరాయికే చెల్లించి.. బతుకు బండిని భారంగా లాగిస్తున్న పేదల కుటుంబాలు సంబురాలు చేసుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లాలోని ఐదు ప్రాంతాల్లో సోమవారం మూడో విడుత రెండు పడకల ఇండ్ల పంపిణీ కార్యక్రమం ఎంతో అట్టహాసంగా జరిగింది. మహేశ్వరం నియోజకవర్గంలోని మన్సాన్పల్లి గ్రామంలో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్పల్లి మండలంలో రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గనులు, భూగర్భ వనరుల శాఖల మంత్రి మహేందర్రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరై లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలను అందజేశారు. అలాగే రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని నార్సింగి, బైరాగిగూడల్లో చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి, గ్రేటర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని నలగండ్లలో రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని అబ్దుల్లాపూర్మెట్లో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, ఎమ్మెల్సీ బుగ్గారపు దయానంద్ గుప్తా లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రులు సబితారెడ్డి, మహేందర్రెడ్డి మాట్లాడుతూ డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం దేశానికే ఆదర్శమని కొనియాడారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా రోడ్లు, విద్యుత్తు, డ్రైనేజీ, తాగునీరు వంటి సకల సదుపాయాలతో ఇండ్లను నిర్మించి ప్రభుత్వం పేదలకు ఉచితంగా అందిస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట తప్పరని, ఇప్పటివరకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చారన్నారు. రానున్న ఎన్నికల్లోనూ సీఎం కేసీఆర్ను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. ఎంపీ రంజిత్రెడ్డి మాట్లాడుతూ పేదల సొంతింటి కల సీఎం కేసీఆర్తోనే నెరవేరుతున్నదన్నారు. ఇతర ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ నిరుపేదలకు వరం డబుల్బెడ్రూం ఇండ్లు అని అన్నారు. ఇంటి పట్టాలు పొందిన లబ్ధిదారులు ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆయన పదికాలాల పాటు సల్లంగా ఉండాలని దీవించారు.
-రంగారెడ్డి, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, అక్టోబర్ 2(నమస్తే తెలంగాణ) : సకల సౌకర్యాలతో పేదలకు రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇస్తున్నదని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం మహేశ్వరం నియోజకవర్గంలోని మన్సాన్పల్లిలో మహేశ్వరం, రాజేంద్రనగర్, ఎల్బీనగర్, సరూర్నగర్ నియోజకవర్గాలకు చెందిన లబ్ధిదారులకు ర్యాండమైజేషన్ విధానంలో కేటాయించిన 2,099 ఇండ్లకు సంబంధించిన మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం దేశానికే ఆదర్శమన్నారు. పేదల సొంతింటి కల నెరవేర్చాలి, ఆత్మగౌరవంతో గొప్పగా జీవించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ‘డబుల్’ ఇండ్ల పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ, తాగునీరు వంటి సౌకర్యాలతో డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించి పేదలకు అందజేస్తున్నామన్నారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో ఎన్ఐసీ సంస్థ రూపొందించిన సాఫ్ట్వేర్ ద్వారా ఆన్లైన్ డ్రా నిర్వహిస్తున్నట్లు వివరించారు. డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం ఎవరూ పైసలు ఇవ్వొద్దని, పైరవీలను నమ్మొద్దన్నారు. కార్యక్రమంలో వికారాబాద్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, ప్రకాశ్గౌడ్, ఆర్డీవో సూరజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
లబ్ధిదారుల్లో వెల్లివిరిసిన సంతోషం..
ఒక్క రూపాయి భారం లేకుండా డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి అందజేయడంతో లబ్ధిదారుల్లో ఆనందం వెల్లివిరిసింది. నిన్నమొన్నటి వరకు అద్దె ఇంట్లో.. నేడు డబుల్ బెడ్ రూమ్.. పొట్ట చేతబట్టుకుని పట్నం వచ్చి కిరాయి కట్టలేక అష్టకష్టాలు పడుతున్న పేదలకు తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూం పథకం రూపంలో సొంతింటి కలను సాకారం చేయడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. సోమవారం మన్సాన్పల్లిలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లకు సంబంధించిన మంజూరు పత్రాలను అందుకున్న సందర్భంగా మంత్రి సబితారెడ్డితో లబ్ధిదారులు తమ సంతోషాన్ని పంచుకున్నారు. దశల వారీగా ఆయా కుటుంబాలు వారం, పది రోజుల్లో గృహ ప్రవేశాలు చేసి పాలు పొంగించుకోనున్నాయి. కలలో కూడా ఊహించని రీతిలో ఇండ్లను కట్టించి ఇచ్చిన సీఎం కేసీఆర్ పది కాలాల పాటు సల్లంగా ఉండాలని లబ్ధిదారుల కుటుంబాలు ఈ సందర్భంగా దీవెనలను అందజేశాయి. లబ్ధిదారులు ఇబ్బందులు పడకుండా బస్సుల్లో తీసుకొచ్చి భోజనం పెట్టి మరీ ఇండ్ల పత్రాలను అందజేయడం ద్వారా మరోసారి తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలపై ఉన్న మమకారాన్ని చాటుకున్నది.
నా ఓటు సీఎం కేసీఆర్కే : నేరేటి అలివేలు
నేను మూసారాంబాగ్ దగ్గర ఉంటున్నా. కుటుంబ పోషణ నిమిత్తం హైదరాబాద్కు వచ్చి పదేండ్లు అవుతున్నది. అప్పటి నుంచి అద్దె ఇంట్లోనే జీవిస్తున్నా. నాకు భర్త లేడు. ఇద్దరు పిల్లలున్నారు. ప్రతినెలా పింఛన్ డబ్బులు వస్తున్నాయి. వాటితోపాటు ప్రైవేట్ జాబ్ చేయడంతో నెలకు రూ.12 వేల వరకు జీతం వస్తున్నది. అందులోంచి రూ.4 వేలు ఇంటి అద్దెకే పోతున్నది. నాకంటూ సొంతిల్లు ఉంటుందని కలలోనూ అనుకోలేదు. కానీ, నా కలను సీఎం కేసీఆర్ సార్ నిజం చేశారు. సీఎం కేసీఆర్తోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యం.. బతికినంత కాలం నా ఓటు సీఎం కేసీఆర్ సార్కే వేస్తా.
పేదలు ఆత్మగౌరవంతో జీవించేలా ‘డబుల్’ ఇండ్లు
అబ్దుల్లాపూర్మెట్, అక్టోబర్ 2 : పేదలు ఆత్మగౌరవంతో జీవించేలా సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకానికి శ్రీకారం చుట్టారని బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. అబ్దుల్లాపూర్మెట్ మండల కేంద్రంలో 180 డబుల్ బెడ్ రూం ఇండ్ల పట్టాలను ఎమ్మెల్సీ బుగ్గారపు దయానంద్గుప్తాతో కలిసి సోమవారం ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిషన్రెడ్డి మాట్లాడుతూ పేదల సొంతింటి కలను సాకారం చేసిన సీఎం కేసీఆర్కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలుపుతున్నారన్నారు. 2014 తర్వాత రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని గమనించి నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ వెంటే ఉండాలని కోరారు. మంచి రోజులు చూసుకుని లబ్ధిదారులంతా గృహ ప్రవేశాలు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డీఈ డీసీనాయక్, రెవెన్యూ అడిషనల్ కమిషనర్ స్నేహషబరీస్, తహసీల్దార్ రవీందర్దత్తు, సీఐ మన్మోహన్, ప్రాజెక్ట్ ఆఫీసర్ అశ్వినీకుమారి, బాటసింగారం రైతు సేవా సహకార సంఘం చైర్మన్ లెక్కల విఠల్రెడ్డి, గ్రామ సర్పంచ్ చెరుకు కిరణ్కుమార్గౌడ్, వార్డు సభ్యుడు మొగుళ్ల జీవన్కుమార్రెడ్డి, నాయకులు జక్క రాంరెడ్డి, కొత్త కిషన్గౌడ్, పూజారి చక్రవర్తిగౌడ్, తోర్పునూరి ధనంజయ్యగౌడ్, జేర్కోని రాజు, జీహెచ్ఎంసీ, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది ఉన్నారు.