హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ) : పండ్లు, కూరగాయల్లో పురుగులమందుల వినియోగంలో తెలంగాణ దేశంలోనే టాప్లో నిలిచింది. లోక్సభలో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ వివరాలు వెల్లడించింది. రాష్ట్రంలో 8,198 పండ్లు, కూరగాయల శాంపిల్స్ సేకరించి పరిశీలించగా.. అందులో 486 నమునాల్లో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) నిర్ణయించిన మోతాదుకంటే పరిమితికి మించి అవశేషాలు ఉన్నట్టు కేంద్రం వెల్లడించింది.
కర్ణాటక ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచినట్టు కేంద్రం తెలిపింది. మొత్తం 9,176 శాంపిల్స్ పరిశీలించగా.. 334 నమునాల్లో మోతాదుకు మించి పురుగులమందుల అవశేషాలు ఉన్నట్టు తేలింది. ఈ జాబితాలో మహారాష్ట్ర మూడో స్థానంలో నిలిచింది. మొత్తం 5,295 శాంపిల్స్ పరిశీలించగా.. 260 నమునాల్లో మోతాదుకు మించి పురుగులమందుల అవశేషాలు ఉన్నట్టు కేంద్రం పార్లమెంట్కు నివేదించింది. 2023-26 మధ్య కాలంలో దేశంలోని 23 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి మొత్తం 70,652 శాంపిల్స్ పరిశీలించినట్టు వెల్లడించింది. ఇందులో 2,223 నమునాల్లో అధిక మోతాదులో పురుగులమందుల అవశేషాలు ఉన్నట్టు కేంద్రం తెలిపింది.