హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): ‘ఐదేండ్ల క్రితం బ్యాంక్ అధికారిని అంటూ ఓ వ్యక్తి నాకు ఫోన్ చేశాడు. బిజినెస్లో నేను చాలా స్మార్ట్ అంటూ టెంప్ట్ చేశాడు. తాను చెప్పే ఇన్వెస్ట్మెంట్తో భారీ లాభాలు వస్తాయని చెప్పాడు. ఆఖరికి నా పేరు కూడా చెప్పేసరికి ఓ దశలో నమ్మేశా’ అంటూ తనకు ఎదురైన సైబర్ నేరం గురించి సినీ నటుడు అక్కినేని నాగార్జున తెలియజేశారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ‘సురక్ష కా తిరంగా’ కార్యక్రమానికి హాజరైన ఆయన సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
మా కుటుంబంలో ఒకరిని 6-7 గంటలపాటు డిజిటల్ అరెస్టు చేశారు. విదేశాలకు నారోటిక్ సబ్స్టాన్స్ పార్సిల్ పంపారంటూ కాల్స్ చేశారు. ఆ ఘటన తీవ్ర భయాందోళనకు గురి చేసింది. ఈ విషయం సీవీ ఆనంద్కు తెలుసు అంటూ డిజిటల్ మోసాలు ఎంత ప్రమాదకరంగా మారుతున్నాయో వ్యక్తిగత అనుభవాన్ని పంచుకున్నారు. కొత్తతరహా సైబర్ నేరాలపై స్పందిస్తూ.. ఫోన్ హ్యాక్ అవుతుందనే భయం ఎప్పుడూ ఉంటుంది. అందుకే ఎంతో జాగ్రత్తగా ఉంటాను.
ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మొబైల్ ఫోన్ పాస్వర్డ్, నెలరోజులకు ఒకసారి వైఫై పాస్వర్డ్ మార్చేస్తాను. వ్యక్తిగత ఫొటోలను మొబైల్ ఫోన్లో సేవ్ చేసుకోను అంటూ సైబర్ నేరాలపై నాగార్జున అవగాహన కల్పించారు. అప్రమత్తంగా ఉన్నప్పుడే సైబర్ నేరాల నుంచి తప్పించుకోవచ్చని అన్నారు. సైబర్ నేరాలు, సినిమా పైరసీ అరికట్టడంలో తెలంగాణ పోలీసులు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నారని అభినందించారు. సినీ ఇండస్ట్రీలో పైరసీ భూతాన్ని తరిమికొట్టడంలో సీవీ ఆనంద్, వీసీ సజ్జనార్ విశేష కృషి చేశారని కొనియాడారు.
సైబర్ నేరాల బారిన పడుతున్నవారిలో రిటైర్డ్ ఉద్యోగులే అధికంగా ఉంటున్నారని డీజీపీ సీవీ ఆనంద్ ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ‘సురక్ష కా తిరంగా’లో రిటైర్డ్ ఉద్యోగులు, సీనియర్ సిటిజన్లను భాగస్వామ్యం చేశామని వెల్లడించారు. వీరితోపాటు ప్రజల్లో సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నట్లు డీజీపీ చెప్పారు. నేరాల స్వరూపం ఎప్పటికప్పుడు మారుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో భౌతికంగా దోపిడీలు ఎకువగా జరిగేవని, ప్రస్తుతం నారోటిక్, సైబర్ నేరాలు పెరిగిపోయాయని అన్నారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖాగోయెల్ సూచించారు. కార్యక్రమంలో హైదరాబాద్ సీపీ సజ్జనార్, సీఎస్బీ, అధికసంఖ్యలో రిటైర్డ్ ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.