షాబాద్/శంకర్పల్లి, అక్టోబర్ 2 : సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచిందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు. సోమవారం చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని శంకర్పల్లి మండలంలో 1512 మంది ఇండ్లు లేని పేదలకు మూడో విడుత డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి తదితరులతో కలిసి మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి వ్యక్తికీ, కుటుంబానికీ ఏదో ఒక సంక్షేమ పథకం ఫలాలు అందాయన్నారు.
శంకర్పల్లిలో రూ.131 కోట్లతో 14 బ్లాకుల్లో 9.03 ఎకరాల్లో 1512 ఇండ్ల నిర్మాణాలు చేపట్టినట్లు వెల్లడించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా జీహెచ్ఎంసీ పరిధిలోని నిరుపేదలకు రూ.10వేల కోట్లతో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను సీఎం కేసీఆర్ నిర్మించి ఇస్తున్నారని తెలిపారు. తొలి విడుతలో 11,700 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందివ్వగా, రెండో విడుతలో 13,200 ఇండ్లను, నేడు మూడో విడుతలో 19,020 ఇండ్ల పంపిణీతో ఇప్పటి వరకు 34,920 ఇండ్లను పంపిణీ చేసినట్లు వివరించారు. ఈ నెల 5న నాలుగో విడుత 17,864 మందికి ఇండ్లను పంపిణీ చేస్తామన్నారు. జీహెచ్ఎంసీ పరిసర, రంగారెడ్డిజిల్లా పరిధిలో 23,260 ఇండ్లను నిర్మించి ఇస్తున్నామన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 9,872, మహేశ్వరంలో 9,892, రాజేంద్రనగర్లో 696, ఎల్బీనగర్లో 944, చేవెళ్ల నియోజకవర్గం శంకర్పల్లిలో 1512, శేరిలింగంపల్లిలో 344 ఇండ్లను నిర్మించి ఇస్తున్నట్లు చెప్పారు.
భావి తరాలకు తెలిసొచ్చేలా అభివృద్ధి : ఎమ్మెల్యే కాలె యాదయ్య
భవిష్యత్తులో భావి తరాలకు తెలిసొచ్చేలా సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తున్నారని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శంకర్పల్లిలో నిర్మించిన డబుల్ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. శంకర్పల్లిలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లలో స్థానికులకు 50 శాతం ఇవ్వాలని కోరానని, 10 శాతం ఇచ్చినట్లు తెలిపారు. సంబంధిత అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి అర్హులకు ఇండ్లను అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. తెలంగాణ రాక ముందు ఏ విధంగా ఉందో, స్వరాష్ట్రం వచ్చాక ఎలా అభివృద్ధి జరిగిందో ప్రజలు ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలతో పాటు మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్న ఘనత రాష్ట్ర సర్కార్దేనన్నారు. 70 ఏండ్ల కాలంలో రాష్ర్టాన్ని పాలించిన కాంగ్రెస్, టీడీపీ తదితర పార్టీలు చేసిందేమీ లేదన్నారు.
ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఆర్డీవో సాయిరాం, మున్సిపల్ చైర్పర్సన్ సాత విజయలక్ష్మీప్రవీణ్కుమార్, ఎంపీపీ గోవర్ధన్రెడ్డి, జడ్పీటీసీ గోవిందమ్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ పాపారావు, వైస్ చైర్మన్ కుర్మ వెంకటేశ్, తహసీల్దార్ సురేందర్, ఎంపీడీవో వెంకయ్య, మున్సిపల్ కమిషనర్ జ్ఞానేశ్వర్, సహకార సంఘం చైర్మన్ శశిధర్రెడ్డి, కౌన్సిలర్ శ్రీనాథ్గౌడ్, మాజీ కార్పొరేటర్ బంగారు ప్రకాశ్, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు రవీందర్గౌడ్, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకట్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు వాసుదేవ్కన్నా, యూత్ అధ్యక్షుడు ఇంద్రాసేనారెడ్డి, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఫరీద్, బీఆర్ఎస్ నాయకులు ప్రవీణ్కుమార్, గోపాల్రెడ్డి, రాఘవేందర్రెడ్డి, బొల్లారం వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.