తాండూరు, మే 27 : అకాల వర్షాలతో తాండూరు నియోజకవర్గంలోని తాండూరు, యాలాల, బషీరాబాద్ మండలాల్లో ధాన్యం పండించిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మూడు రోజుల క్రితం తాండూరు నియోజకవర్గంలో వరుసగా అకాల వర్షాలు కురువడంతో కల్లాల్లో, రోడ్ల పక్కన ఆరబెట్టుకున్న వేలాది క్వింటాళ్ల ధాన్యం తడిసిపోయింది. ముఖ్యంగా తాండూరు మండలం నారాయణపూర్, వీర్శెట్టిపల్లి, గోనూర్, బషీరాబాద్ మండలం కాసింపూర్, యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్, బెన్నూరు, జుంటుపల్లి, అగ్గనూర్ తదితర గ్రామాల పరిధుల్లో ధాన్యం పండించిన అన్నదాతలకు అకాల వర్షాలతో అధికంగా నష్టం కలిగింది. రైతులు తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు నానా కష్టాలు పడి మిల్లులకు ధాన్యాన్ని తరలిస్తే మిల్లరు రకరకాలుగా కొర్రీలు పెడుతున్నారు.
తేమ శాతం ఎక్కువగా ఉందని తడిసిన ధాన్యాన్ని కొనేందుకు ససేమిరా అంటున్నారు. 17 శాతంలోపు తేమ శాతం ఉంటేనే ధాన్యం ట్రాక్టర్లను తూకానికి అనుమతిస్తున్నారు. ఒక్క యాలాల, తాండూరు, బషీరాబాద్ మండలాల్లోనే కనీసం 25 వేల క్వింటాళ్లమేర తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు మిల్లర్లు ఒప్పుకోవడంలేదు. కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్ రైస్ మిల్లులపై పలు రకాల ఆంక్షలు విధించిందని.. తద్వారా తాము తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయలేకపోతున్నామని వారు సమర్థించుకుంటున్నారు.
తడిసిన ధాన్యానికి కేవలం క్వింటాలుకు రూ.1650 మాత్రమే చెల్లిస్తున్నారు. దీంతో రైతుకు ఒక క్వింటాలుకు సగటున కేవలం రూ.1500 ధర మాత్రమే లభిస్తుండటం గమనార్హం. ఒక వైపు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా తూకం వేసి మిల్లులకు తరలిస్తే అక్కడ మిల్లర్లు తూకానికి అనుమతించడంలేదు. రైతులు ఎంతగా బతిమిలాడుకున్నా పచ్చి వడ్లు కొని ముక్కపెట్టుకోమంటారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రైతులు గత్యంతరం లేని పరిస్థితిలో మిల్లర్లకు అతి తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవలసిన ఆగత్యం ఏర్పడింది.