– ఉద్యోగులు, స్థానికులు, రహదారి వినియోగదారులకు వైద్య సేవలు
బీబీనగర్, జూలై 27 : బీబీనగర్ మండలంలోని గూడూరు టోల్ ప్లాజా హైదరాబాద్ – హనుమకొండ టోల్వే ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో, అపెక్స్ హాస్పిటల్ సహకారంతో సోమవారం ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఉద్యోగుల ఆరోగ్యం, శ్రేయస్సు లక్ష్యంగా చేపట్టిన ఈ శిబిరంలో టోల్ ప్లాజా ఉద్యోగులు, భద్రతా సిబ్బంది, స్థానిక ప్రజలు, రహదారి వినియోగదారులు పాల్గొని వైద్య సేవలు పొందారు. శిబిరంలో వైద్య నిపుణులు రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు తదితర ప్రాథమిక పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి వైద్య సలహాలు అందించారు. అలాగే వైరల్ ఇన్ఫెక్షన్ల నివారణ, వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ హెడ్ సెంథిల్ కుమార్ మాట్లాడుతూ ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణకు సంస్థ ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని, ఇలాంటి ఆరోగ్య శిబిరాలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టోల్ ప్లాజా మేనేజర్ నాగేశ్వరరావు, అకౌంట్స్ మేనేజర్ సతీష్, హెచ్ఆర్ మేనేజర్ భాస్కర్, అపెక్స్ హాస్పిటల్ వైద్య బృందం, టోల్ అధికారులు, ఉద్యోగులు, భద్రతా సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

గూడూరు టోల్ ప్లాజాలో ఉచిత ఆరోగ్య శిబిరం