షాబాద్, డిసెంబర్ 16: పిల్లలు ఎదగాలన్నా.. పెద్దలు ఆరోగ్యంగా ఉండాలన్నా ప్రతిరోజూ గుడ్డు తినాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే గుడ్డు సంపూర్ణ పోషకాహారం. ఇందులో మనిషి ఎదుగుదలకు కావాల్సిన మాంసకృత్తులతోపాటు అన్ని రకాల విటమిన్లు మెండుగా ఉంటాయి. ప్రతిరోజూ గుడ్డు తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలుండవు. అయితే గుడ్డును ఆమ్లెట్గా చేసుకుని తింటే ఎలాంటి ఉపయోగం ఉండదు. ఉడకబెట్టి మాత్రమే తినాలని వైద్యులు చెబుతున్నారు.
గుడ్డులో 11 రకాలు ఆమ్లాలు ఉంటాయి. కార్బొహైడ్రేడ్లు, ప్రొటీన్లు, విటమిన్-ఏ, బీ, డీ, ఈ, క్యాల్షియం, పాస్ఫరస్, జింక్ తదితర పోషక పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. పిల్లలకు ప్రతిరోజూ గుడ్డు పెట్టాలని, ఇది వారి ఎదుగుదలకు ఎంతో సాయపడుతుందని వైద్యులు సూచిస్తున్నారు. గుడ్డులోని విటమిన్-ఏ కంటి చూపునకు, విటమిన్-డీ ఎముకల దృఢత్వానికి, విటమిన్-ఈ క్యాన్సర్, గుండెజబ్బుల నుంచి రక్షణ కల్పిస్తాయి. ఇది సంపూర్ణ పోషకాహారం కాబట్టే ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు గుడ్డును పంపిణీ చేస్తున్నది. అయితే స్థూలకాయం, మధుమేహం సమస్యలున్న వారు మాత్రం పచ్చసొన తీసేసి గుడ్డును తినాలని డాక్టర్లు చెబుతున్నారు.
గుడ్డుపై క్యూటికల్ అనే పొర ఉంటుంది. గుడ్డు కడిగినప్పుడు ఈ పొర దెబ్బతింటుంది. ఫ్రిజ్లో పెట్టి ఎక్కువ కాలం నిల్వ ఉంచితే బ్యాక్టీరియా లోపలికి ప్రవేశించి గుడ్డు కుళ్లిపో యే అవకాశం ఉంటుంది. అందుకోసం గుడ్డు ను కడగకుండానే నిల్వ ఉంచితే మేలు. కొనేటప్పుడు గుడ్డును అటుఇటు ఊపి చూడాలి. లోపల సొన కదిలితే గుడ్డు పాడైనట్లు లెక్క. గుడ్లను నీళ్లలో వేసినప్పుడు మునిగితే నాణ్యమైనదిగా.. తేలితే పాడైపోయినట్లుగా భావించాలి. ఇక మచ్చలు లేని తెల్లగుడ్డునే కొనాలి. గుడ్లపై కోళ్లకు సంబంధించి వ్యర్థ్ధాలు లేకుండా చూసుకోవాలి.
చిన్న పిల్లలకు ప్రతిరోజూ గుడ్డును తినిపించాలి. ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. బిడ్డకు తొమ్మిది నెలల వయసు దాటిన తర్వాత గుడ్డు అలవాటు చేయాలి. స్కూల్ పిల్లలకైతే ప్రతిరోజూ ఉదయాన్నే గుడ్డుతోపాటు పాలు తాగిస్తే చాలా మేలు. శరీర దృఢత్వానికి కూడా ఇది దోహదం చేస్తుంది.