జీడిమెట్ల, జూన్ 15 : మద్యం మత్తులో సెల్ ఫోన్ విషయంలో గొడవపడిన ఇద్దరు వ్యక్తులు కత్తులతో పొడుచుకుని గాయపడిన సంఘటన మేడ్చల్ జిల్లాలోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
జీడిమెట్ల సీఐ కె.బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నాటక రాష్ట్రం బీదర్కు చెందిన అమీర్ (20), సిద్దు (22), ఇమ్రాన్ (28)లు ఉపాధి కోసం వలస వచ్చి సెంట్రింగ్ పనులు చేస్తూ మార్కండేయ నగర్లో ఓ అద్దె ఇంట్లో ముగ్గురు నివాసం ఉంటున్నారు. మంగళవారం రాత్రి అమీర్, సిద్దు , ఇమ్రాన్ను కలిసి మద్యం సేవించారు.
ఈ సమయంలో సిద్దు సెల్ ఫోన్ కింద పడడంతో ఇమ్రాన్ లాక్కున్నాడు. దీంతో కోపోద్రిక్తుడైన సిద్దు ఇంట్లో ఉన్న కత్తితో ఇమ్రాన్పై దాడి చేశారు. దాడి చేయగా చిన్న గాయమైంది. ఇమ్రాన్ సిద్దు వద్ద ఉన్న కత్తిని లాక్కొని సిద్దును కడుపులో నాలుగు పోట్లు పోడిచాడు.
చికిత్స నిమిత్తం సిద్దు, ఇర్ఫాన్ను గాంధీ దవాఖానకు తరలించారు. ఇమ్రాన్కు స్వల్ప గాయం కాగా సిద్దు గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.