కేపీహెచ్బీ కాలనీ, ఏప్రిల్ 11 : తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ఆగం చేస్తే కేంద్ర ప్రభుత్వానికి పుట్టగతులుండవని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సోమవారం ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు నిరసన దీక్షలో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కుర్మయ్యగారి నవీన్కుమార్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం వివక్షత చూపుతుందన్నారు.
పంజాబ్లో మాదిరిగానే తెలంగాణ రాష్ట్రంలో పండిన వరి ధాన్యానంతా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందేనన్నారు. కేంద్ర మంత్రులు తెలంగాణ ప్రజా ప్రతినిధులను, రైతుల పట్ల చిన్నచూపు చూడడం, హేలనగా మాట్లాడడం మానుకోవాలన్నారు. రైతులను ఆగం చేసిన రాజ్యాలు, రాజ్యాధికారులు మనుగడ సాగించినట్లు చరిత్రలో లేదన్నారు. ధాన్యాన్ని కొనుగోలు చేసే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు.