కొండాపూర్ : లిఫ్ట్ ( Lift ) లో ఇరుక్కుని మహిళ ( Women ) మృతి చెందిన ఘటన చందానగర్( Chandanagar ) పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మృతురాలి భర్త, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగండ్ల ఎస్సీ కాలనీలో నివాసం ఉండే ధాడి శ్రీనివాస్, తన భార్య అనసూయ(43) తో కలిసి మంగళవారం చందానగర్ అన్నపూర్ణ ఎన్క్లేవ్లోని చాట్వాజ్ మెన్షన్ అపార్ట్మెంట్లో ఉంటున్న మేనమామ ధాడి గోవింద్ను పరామర్శించేందుకు వచ్చారు.
అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్లో లిఫ్ట్ వద్దకు చేరుకున్న అనంతరం శ్రీనివాస్ ముందుగా లిఫ్ట్లోకి ప్రవేశించగా, అనసూయ లిఫ్ట్లోకి ఎక్కుతున్న సమయంలో ఒక కాలు లోపల, మరో కాలు బయట ఉండగానే లిఫ్ట్ తలుపులు పూర్తిగా మూసుకోకముందే అకస్మాత్తుగా పైకి కదిలింది. దీంతో ఆమె లిఫ్ట్, ప్రవేశ ద్వారం మధ్య ఇరుక్కుపోయి తీవ్ర గాయాలపాలై అపస్మారక స్థితిలోకి వెళ్లింది. భర్త శ్రీనివాస్ కేకలు వేయడంతో అపార్ట్మెంట్ వాసులు, స్థానికులు అక్కడికి చేరుకుని లిఫ్ట్ను నిలిపేసి అనసూయను బయటకు తీశారు.
ఆమెను వెంటనే చందానగర్లోని ప్రైవేట్ దవఖానాకు తరలించగా పరీక్షించిన వైద్యులు అనసూయ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా ప్రమాదం జరిగిన సమయంలో లిఫ్ట్ మరమ్మత్తు పనులు జరుగుతున్నప్పటికీ, లిఫ్ట్ టెక్నీషియన్ అనిల్ కుమార్ ప్రధాన విద్యుత్ సరఫరాను నిలిపివేయకుండా, నివాసితులను అప్రమత్తం చేసేలా ఎలాంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకుండా పనులు నిర్వహించాడని అనసూయ భర్త ఆరోపించారు.
లిఫ్ట్ టెక్నీషియన్ నిర్లక్ష్యంతో పాటు అపార్ట్ మెంట్ అసోసియేషన్ సభ్యులు, లిఫ్ట్ నిర్వహణ సంస్థ జాన్సన్ ఎలివేటర్స్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తన భార్య మృతి చెందిందని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.