జీడిమెట్ల, డిసెంబర్ 5 : ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన బారికేడ్ల(Barry Cades)ను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లిన(Robbed) సంఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జీడిమెట్ల సీఐ ఎం.పవన్ తెలిపిన వివరాల ప్రకారం.. అసెంబ్లీ ఎన్నికల నిమిత్తం కుత్బుల్లాపూర్ మున్సిపల్ చౌరస్తాలో ట్రాఫిక్ నియంత్రణ కోసం జీడిమెట్ల ట్రాఫిక్ పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు.
ఎన్నికల ప్రక్రియ అనంతరం వాటిని తరలించేందుకు ట్రాఫిక్ పోలీసులు వచ్చి అక్కడ చూస్తే భారికేడ్లు కనిపించకపోవడంతో షాక్కు గురయ్యారు. ట్రాఫిక్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జీడిమెట్ల ట్రాఫిక్ పోలీసులు జీడిమెట్ల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా, ఏర్పాటు చేసిన భారికేడ్లను గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలో తరలించినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.