మేడ్చల్: దేశంలో ఎక్కడా లేని విధంగా కులవృత్తులకు చేయుతనందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని కార్మిక, ఉపాధి శాఖ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ అభ్యర్థి చామకూర మల్లారెడ్డి (Minister Malla reddy) అన్నారు. నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రాంపల్లిలో శనివారం నిర్వహించిన గౌడుల ఆత్మీయ సభలో మంత్రి పాల్గొని మాట్లాడారు.
రాష్ట్రంలో నీరా కేఫ్ పెట్టి దేశంలో గౌడ కులస్తులకు గుర్తింపు తెచ్చారని ఆయన అన్నారు. కాంగ్రెస్ హయంలో కల్లు దుకాణాలను మూసివేసి ఇబ్బందులపాలు చేశారని ఆరోపించారు. గౌడ కులస్తులకు ఈత వనాల పెంపు, ప్రమాద బీమాను అందించారని వెల్లడించారు. రాబోయే రోజుల్లోనూ గౌడ కులస్తులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఎన్నికలు అభివృద్ధి చేసిన బీఆర్ఎస్కు, తెలంగాణ అభివృద్ధి వ్యతిరేకులకు మధ్య జరుగుతున్న ఎన్నికలని అన్నారు. అభివృద్ధిని చూసి బీఆర్ఎస్కు ఓటు వేయాలని మంత్రి కోరారు.
కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరికలు
మేడ్చల్ మండల పరిధిలోని గౌడవెల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మంత్రి మల్లారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేశారు. కాంగ్రెస్కు చెందిన సంబపురం వీరస్వామి, సతీష్ గౌడ్, కోమటి రమేశ్, శ్రీకాంత్ చారి, వేణుగౌడ్, నాగరాజుగౌడ్, అశోక గౌడ్, బాబు చారి, విజయ్ గౌడ్, సుందపురం అరుణ్, లోకనాథ్, రాజు, శంకర్, రాజేశ్ తదితరులు బీఆర్ఎస్లో చేరారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో బీఆర్ఎస్ను ఎదుర్కొనే సత్తా ఏ పార్టీకి లేదన్నారు. కాంగ్రెస్ నేతలు తాము గెలుస్తామని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.