మేడ్చల్ మల్కాజిగిరి : గ్యాస్ ధరలు విచ్చలవిడిగా పెంచుతూ ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్న ప్రధాని మోదీ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ అన్నారు.కేంద్ర ప్రభుత్వం మరోసారి రూ.50 పెంచిన గ్యాస్ ధరలను నిరసిస్తూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని చింతల్లో మహిళా నాయకురాలు చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
మహిళలు ఖాళీ సిలిండర్లతో మోదీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ ప్రజలపై ఆర్థిక భారం మోపుతూ ఇబ్బందులకు గురి చేస్తుందని మండిపడ్డారు.
గృహావసరాల కోసం వినియోగించే 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్పై రూ.50 మేర ఇష్టం వచ్చినట్లు పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన ధరలతో ప్రజలు గ్యాస్ సిలిండర్ను వీడి కట్టెల పొయ్యిని ఎంచుకునే పరిస్థితులు నెలకొన్నాయన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
పెంచిన గ్యాస్ ధరలతో పేద, మధ్య తరగతి ప్రజలు అనేక కష్టాలు అనుభవిస్తున్నారని అన్నారు. బీజేపీ పాలనలో పెట్రోలు, డీజీల్ ధరలు పెంచుతూ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని, రాబోయే రోజుల్లో మోదీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు.