మేడ్చల్, మార్చి 30(నమస్తే తెలంగాణ): వరి ధాన్యం కొనుగోలుకు సంబంధిత ఏర్పాట్లపై ప్రభుత్వాధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మేడ్చల్ జిల్లా యంత్రాంగం ఏర్పాట్లపై చర్యలు చేపట్టింది. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా 13,579 ఎకరాల విస్తీర్ణంలో వరిని సాగు చేస్తున్నారు. సాగు చేస్తున్న విస్తీర్ణం ద్వారా 33,948 వేల మెట్రిక్ టన్నుల వరి దిగుబడులు రానున్నట్లు అధికారులు అంచనా వేశారు. దీంతో దిగుబడుల అంచనా మేరకు కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో నెల రోజులలో వరి కోతలు మొదలు కానున్నాయి. 8,678 మంది రైతులు వరి సాగును చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయాధికారిణి మేరి రేఖ వెల్లడించారు. గత సంవత్సరం యాసంగిలో కొనుగోలు కేంద్రాల ద్వారా 16,387.240 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. ఈ సంవత్సరం వర్షాలు విస్తృతంగా పడటంతో అధిక విస్తీర్ణంలో వరి సాగు చేపట్టారు.
వరి కోతలు ప్రారంభమైన అనంతరం, వరి ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలను ఊర్లోనే ఏర్పాటు చేసి రైతుల వద్ద నుంచి కొనుగోలు చేయడానికి అధికారులు సన్నద్ధం అవుతున్నారు. పన్నెండు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, ఊర్లోనే సబ్ కేంద్రాల ద్వారా కొనుగోలు చేయనున్నారు. ధాన్యం కోనుగోలు వ్యవసాయ శాఖ, పౌర సరఫరాల శాఖ, లీగల్ మెట్రాలాజీ, మార్క్ఫెడ్ శాఖలు భాగస్వామ్యులు కానున్నాయి. ధాన్యం కొనుగోలును మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ పర్యవేక్షిస్తారు. ఊర్లోనే ధాన్యం కొనుగోళ్లపై జిల్లా రైతాంగం సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఊర్లోనే ధాన్యం కొనుగోలుతో రైతులకు మేలు జరిగుతుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం రైతులకు న్యాయం జరిగే విధంగా ఉంటుందన్న అభిప్రాయాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు.