కుత్బుల్లాపూర్, మే19 : డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయాలలో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించి, లబ్ధిదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఆదేశించారు. పేట్ బషీరాబాద్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని నిజాంపేట్, బాచుపల్లి, కైసర్నగర్, దుండిగల్, డిపోచంపల్లి, బహదూర్పల్లి, దేవేందర్నగర్ ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులు, వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో హౌసింగ్బోర్డు, వాటర్వర్క్స్, విద్యుత్ శాఖ, మున్సిపాలిటీ, ఇంజినీరింగ్ తదితర శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొని క్షేత్రస్థాయి సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడుతూ పేద ప్రజలకు గౌరవప్రదమైన జీవనం కల్పించాలనే లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అధినేత కేసీఆర్ దూరదృష్టితో సకల సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి వేలాది మంది పేద కుటుంబాలకు అందజేశామని గుర్తు చేశారు.
అయితే ప్రస్తుతం ఆ ఇళ్ల సముదాయాలలో నివసిస్తున్న లబ్ధిదారులకు అవసరమైన కనీస మౌలిక వసతులు సకాలంలో కల్పించడంలో ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తొందని ఆవేధన వ్యక్తం చేశారు. లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యనిర్వహణ, విద్యుత్ సరఫరా, వీధిదీపాల ఏర్పాటు, రహదారుల అభివృద్ధి, రవాణా సౌకర్యాల కల్పన వంటి అంశాలకు అధికారులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రతి ఇంటికి ఇంటి నంబర్లను కేటాయించాలని, ప్రార్ధన మందిరాలను నిర్మించాలని, అధికారులు సమన్వయంతో పని చేసి సమస్యలను సకాలంలో పరిష్కరించాలని పలు సూచనలు ఇచ్చారు. ఈ సమావేశంలో ఆయాశాఖల అధికారులతో పాటు లబ్ధిదారులు పాల్గొన్నారు.