Madhya Pradesh : ఒక వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యం ఏకంగా 9 మంది ప్రయాణికుల ప్రాణాలు తీసింది. 11 మంది ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్ కాలువలో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో 9 మంది మరణించగా, ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ జిల్లాలోని సారంగపూర్ పట్టణ పరిధిలో సోమవారం ఉదయం 9.00 గంటలకు జరిగింది. మధ్యప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక చోట్ల నదులు, కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. సారంగపూర్ పట్టణ పరిధిలోని పడానా బైపాస్ మార్గంలో ఒక కాలువ ఉంది. భారీ వర్షాల కారణంగా ఈ కాలువ సోమవారం ఉప్పొంగింది.
దీంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. కాలువకు రెండు వైపులా స్థానికులు, కొందరు అధికారులు కూడా ఉండి పరిస్తితిని పర్యవేక్షించారు. ఇదే సమయంలో ఒక వ్యాన్ ఈ మార్గంలో వచ్చి కాలువ దాటేందుకు ప్రయత్నించింది. దీంతో అక్కడ ఉన్న స్థానికులు అది సాధ్యం కాదని వ్యాన్ డ్రైవర్కు చెప్పారు. కాలువలో నీరు ఉప్పొంగుతోందని, వ్యాన్తో వెళ్తే ప్రమాదం అని, కొట్టుకుపోయే అవకాశం ఉందని కూడా హెచ్చరించారు. అప్పటికే ఆ వ్యాన్లో 11 మంది ప్రయాణికులున్నారు. కానీ, ఆ వ్యాన్ డ్రైవర్ వారి మాటల్ని వినిపించుకోలేదు. ఎంత ఉప్పొంగినా కాలువ దాటగలననే మూర్ఖత్వంతో వ్యాన్ను కాలువలోంచి పోనిచ్చాడు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత భారీగా వస్తున్న నీటి వేగానికి ఆ వ్యాన్ కాలువలో కొట్టుకుపోయింది. స్థానికులు చూస్తుండగానే, క్షణాల్లో వ్యాన్ నీటిలో పడి కొట్టుకుపోసాగింది. ఈ క్రమంలో అందులోని ఇద్దరు ఎలాగోలా బయటపడి, తమనుతాము రక్షించుకున్నారు.
వెంటనే గమనించిన స్థానికులు కూడా ఈ ఇద్దరితోపాటు మిగతావారిని రక్షించే ప్రయత్నం చేశారు. తమ ప్రాణాలకు తెగించి స్థానికులు.. తాళ్లతో వారిని గాలించే ప్రయత్నం చేశారు. ఇద్దరిని ఒడ్డుకు చేర్చగలిగారు. అప్పటికే వ్యాన్ చాలాదూరం కొట్టుకుపోయింది. వ్యాన్లోని 9 మంది కూడా ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెస్క్యూ బృందాలు, స్థానికుల సహాయంతో తొమ్మిది మంది మృతదేహాల్ని వెలికితీశారు. వ్యాన్ను కూడా బయటకు తీసి, పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఘటనపై సారంగపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తమ మాట వినిపించుకోని డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.