– అనేక సందేహాలకు తావిస్తున్న అధికారుల చర్యలు
ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 16 : ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై గత కొద్ది సంవత్సరాల నుండి రెవెన్యూ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కోట్లాది విలువైన భూములను స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అధికారులు అట్టి స్థలాలలో ప్రభుత్వ స్థలాలుగా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే బుధవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డు సర్వే నంబర్ 142లో ఆక్రమణలకు గురి అయ్యిందని భావించిన మండల రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డును ఆ ప్రదేశంలో ఏర్పాటు చేశారు. స్థానిక జిపిఓ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జిపిఓ లు బోర్డును ఏర్పాటు చేసి మాట్లాడారు. సర్వే నెంబర్ 142లో సుమారు మూడు ఎకరాల భూమి, దాదాపు రూ.15 కోట్ల విలువ ఉంటుందని, ఈ ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు కబ్జా చేయడానికి ప్రయత్నం చేశారని తిరిగి తాము స్వాధీనం చేసుకుని బోర్డు పెట్టడం జరిగిందని వారు పేర్కొన్నారు. ఇకనుంచి ఈ స్థలంలో ఆక్రమణ చర్యలు పాల్పడితే చర్యలు తీసుకుంటామని జిపిఓ కోటేశ్వరరావు హెచ్చరించారు.
మండల రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలాలను కాపాడేందుకు తీసుకుంటున్న చర్యలను ప్రతి ఒక్కరూ హర్షిస్తున్నారు. అయితే ఇదే సమయంలో స్థానికుల నుండి పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ స్థలంకు కూత వేటు దూరంలో గత కొద్ది నెలల క్రితం రెవెన్యూ అధికారులు గిరిజన వ్యక్తులు కొందరు అసైన్డ్ ల్యాండ్ ని ఆక్రమణ చేశారని అట్టి స్థలాన్ని స్వాధీనం చేసుకుని బోర్డును పెట్టారు. ఆ ప్రదేశంలో సదరు వ్యక్తులు ఏర్పాటు చేసుకున్న ఫెన్సింగ్ జెసిబిల సహాయంతో తొలగించారు. వారు నాటుకున్న మొక్కలను సైతం పూర్తిగా ఆనవాళ్లు లేకుండా తొలగించడం జరిగింది. అయితే బుధవారం స్వాధీనం చేసుకున్న స్థలంలో ఫెన్సింగ్ జోలికి వెళ్లకుండా, ఆ స్థలంలో వివిధ నిర్మాణాలు ఉన్నప్పటికీ వాటి జోలికి వెళ్లకుండా కేవలం హెచ్చరిక బోర్డును శాశ్వతంగా కాకుండా. మట్టిలో ఉంచి వెళ్లడం పలు సందేహాలకు తాగిస్తుంది. అనేకమార్లు ఆక్రమణలకు పాల్పడినట్లు తెలిపిన అధికారులు వారిపై చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని చర్చ జరుగుతుంది. ప్రభుత్వ అధికారులు ప్రైవేటు నిర్మాణాలను తొలగిస్తారా లేక వేచి చూసే ధోరణి కనబరుస్తారా అనేది వేచి చూడాల్సిందే.