జీడిమెట్ల, జులై 19 : మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ కళాశాల మంజూరు చేసిందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో నిరుపేద, మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని తన విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో నియోజకవర్గానికి నూతనంగా డిగ్రీ కళాశాల మంజూరు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
మంగళవారం హెచ్ఎంటీ అధికారులు, విద్యాశాఖ అధికారులతో కలిసి చింతల్ హెచ్ఎంటీలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వినియోగించిన భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిరుపేద ప్రజలు ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రం ఉండడంతో ప్రైవేటు కళాశాలలో వేలాది రూపాయాలు ఫీజులు చెల్లించి ఉన్నత చదువులను మధ్యలోనే నిలిపివేస్తున్నారని తెలిపారు.
ఈ విద్యా సంవత్సరం అక్టోబర్ నుంచే నూతనంగా మంజూరైన డిగ్రీ కళాశాలలో అక్టోబర్ నుంచే ప్రారంభమవుతాయన్నారు. త్వరలోనే డిగ్రీ కళాశాల ఏర్పాటుకు స్థలాన్ని ఎంపిక చేసి శాశ్వత భవనం నిర్మాణం పూర్తి చేసేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే వెల్లడించారు.
కార్యక్రమంలో కళాశాల విద్యా శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ యాదగిరి, అకాడమిక్ గైడెన్స్ ఆఫీసర్ డాక్టర్ డీ.టీ.చారి, పటాన్ చెరు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్తో పాటు నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.