బోడుప్పల్, మే 4: సమాజంలో సంఘటితంగా ఉంటే గణనీయ అభివృద్ధి పనులు సాధించవచ్చని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లక్ష్మీగణపతి నగర్ కాలనీ ముఖద్వారాన్ని ఆదివారం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, స్థానిక నాయకులతో కలిసి మల్లారెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ నేతృత్వంలో నగర శివారు ప్రాంతాలు గణనీయంగా అభివృద్ధి చెందాయని తెలిపారు. గడిచిన ఏడాదిన్నర కాలంలో కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని అన్నారు. 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని పేర్కొన్నారు. లక్ష్మీ గణపతి నగర్ కాలనీ ముఖద్వారాన్ని సొంత నిధులతో బీఆర్ఎస్ స్థానిక మాజీ కార్పొరేటర్ కొత్త శ్రీవిద్య చక్రపాణి గౌడ్ రూ .2.50 లక్షల నిధులతో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం 72 సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు.