మల్కాజిగిరి : ఆనంద్బాగ్లోని శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో శుక్రవారం మహాపూర్ణాహుతి, శ్రీ వారి చక్రస్నానం కన్నుల పండువలా సాగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి రథయాత్ర అంగరంగవైభవంగా నిర్వహించారు. ఆనంద్బాగ్ ఆలయం నుంచి ప్రారంభమైన రధయాత్ర ఆర్కేనగర్, వాణీనగర్, సాయినగర్ లమీదుగా సాగింది. దారిపొడవునా భక్తులు స్వామివారిని మనసారా స్మరించుకుని దర్శించుకున్నారు.
శుక్రవారం మహాపూర్ణాహుతితో పాటు మూర్తి కుంభ ప్రదక్షిణ, సంప్రోక్షణ నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్వామివారి పుష్కరిణిలో స్వామివారికి చక్రస్నానం అత్యంత భక్తిశ్రద్దలతో నిర్వహించారు. ఆలయ ఈ ఓ రవీందర్రెడ్డి, ప్రధానార్చకులు ముడుంబై వేంకటరమణాచార్యులు, తులసి రమణాచార్యులు లతో పాటు ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు పాల్గొన్నారు.