కాప్రా, మే 18 : ప్రజల ఆరోగ్యపరిరక్షణలో ఆశా వర్కర్లు కీలకమైన పాత్ర పోషిస్తున్నారని, వారి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరింపజేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారిలక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం నియోజకవర్గం పరిధిలోని ఆశావర్కర్లు, వారి ప్రతినిధులు లక్ష్మారెడ్డిని సైనిక్పురిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు. విధులు నిర్వహించే సందర్భంగా ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులను వారు ఎమ్మెల్యేకు వివరించారు.
తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరింపజేయాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆశా వర్కర్లు ప్రజలకు దగ్గరగా ఉంటూ వారికి మెరుగైన వైద్యసేవలు అందించడం అభినందనీయమని, వారి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాననీ, పరిష్కరింపజేసేందుకు తనవంతు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. ఆశార్కర్ల ప్రతినిధులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.