హైదరాబాద్ : అందుబాటులోని వ్యాక్సిన్ డోసులతో రాష్ట్రంలో కరోనా తీవ్రతను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ నియోజకవర్గం మేడ్చల్, కీసరలో 10 రోజుల పాటు సూపర్ స్ప్రెడర్స్, ఫ్రంట్ లైన్ వారియర్స్గా గుర్తించిన జర్నలిస్టుల కొరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాక్సినేషన్ కార్యక్రమాన్ని మంత్రి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది సూపర్ స్ప్రెడర్లను అంచనా వేసి మొదటి విడతలో 7.50 లక్షల మందికి వాక్సిన్ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ చర్యతో మంచి ఫలితాలు వస్తాయన్నారు.
దేశంలో వాక్సిన్ కొరత వల్ల ఉన్న వాక్సిన్ను ఏ విధంగా ఉపయోగించి కరోనా తీవ్రతను తగ్గించాలనే దానిపై ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డీహెచ్ఎంవో మల్లికార్జున్, మున్సిపల్ చైర్మన్ దీపికా నర్సింహారెడ్డి, జడ్పీటీసీ శైలజ విజయందర్ రెడ్డి, ఎంపీపీలు పద్మజగన్ రెడ్డి, ఇందిరా లక్ష్మినారాయణ, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వైద్య అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.