మేడ్చల్ రూరల్ : గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల మెయిన్ క్యాంపస్కు అఖిల భారత సాంకేతి విద్యా మండలి(ఏఐసీటీఈ) నుంచి నిధులు మంజూరయ్యాయి. మార్గదర్శన్ పథకం కింద రూ.50 లక్షలు విడుదలయ్యాయి. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ రామస్వామిరెడ్డి మాట్లాడుతూ మూడు సంవత్సరాల కాల పరిమితి ఉన్న ఈ పథకం కింద ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని 10 ఇంజినీరింగ్ కళాశాలలకు ఎన్బీఏ గుర్తింపు సాధించడానికి అవసరమైన శిక్షణను పలు విడతల్లో ఇస్తామన్నారు.
ఎన్బీఏ గుర్తింపు పొందిన తమ కళాశాల వివిధ యూజీ, పీజీ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయడంతో ఈ పథకం కింద ఎంపిక చేశారన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ అవకాశాన్ని దక్కించుకున్న మూడు కళాశాలల్లో మల్లారెడ్డి ఒకటి కావడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ డీన్ డాక్టర్ ఉదయ్ భాస్కర్, పరిశోధనా విభాగం డీన్ డాక్టర్ సుదర్శన్ రెడ్డి, ఐఈఏసీ సమన్వయకర్తలు డాక్టర్ రాజేశ్వరన్, శ్రీబసవ వంశీ పాల్గొన్నారు.