కోల్కతా: నేతాజీ సుభాష్ చంద్ర బోస్పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ నాగేంద్ర రాయ్ అలియాస్ అనంత మహారాజ్పై పశ్చిమ బెంగాల్లోని బీజేపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత ప్రభుత్వం ఆయనకు ప్రదానం చేసిన అత్యున్నత పౌర పురస్కారం ‘బంగా విభూషణ్’ను గురువారం ఉపసంహరించుకున్నది. (BJP MP Nagendra Ray) రాష్ట్రానికి, ప్రజలకు అందించిన విశిష్టమైన, ఆదర్శప్రాయమైన సేవలకు గుర్తింపుగా ‘బంగా విభూషణ్’ పురస్కారాన్ని ప్రదానం చేస్తారని, దీనికి అత్యున్నత స్థాయి గౌరవ ప్రతిష్టలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
అయితే బీజేపీ ఎంపీ నాగేంద్ర రాయ్కు ఈ పురస్కారాన్ని కొనసాగించడం అనేది ఆ పురస్కారం గౌరవం, ప్రతిష్ట, ఉద్దేశాలకు విరుద్ధమని ప్రభుత్వం ఆరోపించింది. ఈ నేపథ్యంలో 2026 ఫిబ్రవరి 21న నాగేంద్ర రాయ్కు ప్రదానం చేసిన ‘బంగా విభూషణ్’ పురస్కారాన్ని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకుని రద్దు చేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే నిర్దిష్ట ఉల్లంఘనకు కారణం ఏమిటన్నది ప్రభుత్వం ప్రస్తావించలేదు.
మరోవైపు నేతాజీ సుభాష్ చంద్ర బోస్పై బీజేపీ ఎంపీ నాగేంద్ర రాయ్ సోషల్ మీడియాలో వివాదస్పద పోస్ట్ చేశారు. నేతాజీని ‘యుద్ధ నేరస్థుడు’గా అభివర్ణించారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో ఆయన నాయకత్వాన్ని, ఆజాద్ హింద్ ఫౌజ్లో ఆయన పాత్రను ప్రశ్నించారు. సీఎం సువేందు అధికారి దీనిపై స్పందించారు. స్వాతంత్ర్య సమరయోధుడు, బెంగాల్లో అత్యంత గౌరవనీయులైన నేతాజీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసేవారిపై అరెస్ట్తో సహా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఈ ఆదేశాలు జారీ చేసిన 24 గంటల లోపే నాగేంద్ర రాయ్కు గతంలో ప్రదానం చేసిన అత్యున్నత పౌర పురస్కారం ‘బంగా విభూషణ్’ను కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకున్నది.