నల్గొండ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం డ్యాం నుంచి పోతిరెడ్డిపాడు కాలువ ద్వారా కృష్ణా జలాలను అక్రమంగా తరలించుకుపోతున్న ఆంధ్ర జలదోపిడిని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యిందని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ( Nomula Bhagat Kumar ) ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలను అక్రమంగా తరలించకుపోతుండగా నాగార్జునసాగర్ ( Nagarjuna Sagar ) లో వరుణ యాగం నిర్వహించడం విడ్డూరంగా తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఆరోపణలు గుప్పించారు. కృష్ణా నదిలో మిగులు జలాలను మాత్రమే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఏపీ వాడుకోవాలే తప్ప నికరజలాలను తీసుకుపోయే హక్కు లేదని వెల్లడించారు. ఆరు టీఎంసీల నీటిని ఏపీ అక్రమంగా తరలించకపోతుందని ఆరోపించారు.
శ్రీశైలం ప్రాజెక్టు నిండకుండా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీరును అక్రమంగా తరలించుకొని పోతే భవిష్యత్తులో నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిండడం సాధ్యం కాదని అన్నారు. తరలిస్తున్న నీటిని అరికట్టి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్ కు నీటిని విడుదల చేసి ఈ ప్రాంత రైతులను ఆదుకోవాలని కోరారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రులకు ఈ ప్రాంత రైతుల పట్ల గాని, అభివృద్ధి పట్ల గాని ఏమాత్రం చిత్త శుద్ధి లేదని పేర్కొన్నారు.