– కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖల మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి ఎంపీ వద్దిరాజు వినతి
కొత్తగూడెం గణేష్ టెంపుల్, ఆగస్టు 13 : దేశంలోని పెట్రోలియం, డీజిల్, సహజ వాయువు (వంటగ్యాస్) డీలర్లు ఎదుర్కొంటున్న తక్షణ సమస్యలను పరిష్కరించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆయన పార్లమెంట్ ఆవరణలో పెట్రోలియం, సహజవాయువు శాఖల మంత్రి హర్దీప్ సింగ్ పూరీని కలిసి వినతిపత్రం అందజేసి డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. యునైటెడ్ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కు చెందిన తెలంగాణ,కేరళ, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, పశ్చిమ బెంగాల్, బీహార్ తదితర రాష్ట్రాలకు చెందిన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డీలర్ల మార్జిన్ (కమీషన్)పెంచాల్సిందిగా తనతో పాటు స్థాయీ సంఘం ఛైర్మన్ సునీల్ దత్తాత్రే తర్కరేను ఇటీవల కలిసి కోరడాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దేశ వ్యాప్తంగా ఉన్న డీలర్లకు 8 ఏళ్ల కిందట ఖరారు చేసిన మార్జిన్ ఇప్పటికీ కొనసాగుతున్నదని, మారిన పరిస్థితుల దృష్ట్యా ఈ మొత్తాన్ని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర వివరించగా మంత్రి హర్దీప్ సింగ్ పూరీ సానుకూలంగా స్పందించారు.