– డా.జి.వి. రమేశ్, మండల ప్రత్యేక అధికారి
నల్లగొండ రూరల్, సెప్టెంబర్ 11 : వీబీ జీ రామ్ జీ కార్యక్రమంలో భాగంగా వికసిత్ గ్రామ పంచాయతీ ప్లాన్ (VGPP) తయారీపై నల్లగొండ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల ప్రత్యేక అధికారి డా. జి.వి.రమేశ్ మాట్లాడుతూ… ప్రతి గ్రామానికి అవసరమైన అభివృద్ధి పనులను గుర్తించి, వాటికి ప్రాధాన్యత క్రమాన్ని నిర్ణయించి, వచ్చే ఐదు సంవత్సరాలకు ఉపయోగపడే విధంగా పకడ్బందీగా, సమగ్రంగా వీజీపీపీ ప్రణాళికను రూపొందించాలని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, అధికారులను కోరారు.
ఈ నెల 15న గ్రామ సభ నిర్వహించి గ్రామానికి అవసరమైన అభివృద్ధి పనులు అలాగే ప్రణాళికపై విస్తృతంగా చర్చించాలని సూచించారు. సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు ట్రాన్సెక్ట్ వాక్, రిసోర్స్ మ్యాపింగ్ నిర్వహించి, గ్రామంలోని అందుబాటులో ఉన్న వనరులు, అవసరాలు, అభివృద్ధి అవకాశాలను గుర్తించాలని కోరారు. ఈ నెల 19న గుర్తించిన అభివృద్ధి పనులను గ్రామసభ ఆమోదం పొందిన అనంతరం ఎంపీడీవో కార్యాలయానికి పంపించాలని సూచించారు. గ్రామాల్లో కూలీల (వేజ్ సీకర్స్) సంఖ్యను పెంచి, ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు మరియు ప్రజలకు సంబంధించిన సమాచారాన్ని విస్తృతంగా చేరవేయాలని కోరారు. వాతావరణ పరిస్థితులు, ఎల్నినో ప్రభావం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని, గ్రామాల భవిష్యత్ అవసరాలను పరిగణనలోకి తీసుకుని ప్రణాళిక రూపొందించాలని సూచించారు.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గ్రామానికి అత్యవసరంగా అవసరమైన పనులను గుర్తించి, వాటిని ప్రాధాన్యత క్రమంలో చేర్చి సమగ్ర ప్రణాళికను రూపొందిస్తే గ్రామాల అభివృద్ధికి మరింత మంచి అవకాశాలు ఏర్పడతాయని డా.రమేష్ తెలిపారు. ఎంపీడీఓ యాకూబ్ నాయక్ మాట్లాడుతూ వీబీ జీ రామ్ జీ కార్యక్రమం ద్వారా మొత్తం 22 విభాగాలకు సంబంధించిన 318 రకాల పనులను గ్రామాల్లో చేపట్టే అవకాశం ఉందని తెలిపారు. ప్రతి గ్రామానికి అవసరమైన పనులను గుర్తించి VGPPలో చేర్చుకోవాలని కోరారు. ఆయా పనులకు సంబంధించిన మార్గదర్శకాలు, వివరాలను సమావేశంలో వివరించారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, గ్రామ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.