తెలంగాణ ప్రభుత్వం రాకముందు సర్కారు దవాఖాన అంటే సమస్యల పుట్టల్లా ఉండేవి. సౌకర్యాలు లేక.. సరైన వైద్యం అందక.. దవాఖానకు రావాలంటేనే జనం జంకేవారు. ఆ రోజులకు కాలం చెల్లింది. రాష్ట్రం వచ్చాక సర్కారు దవాఖానల్లో సౌకర్యాలతో పాటు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందుతున్నది. రాష్ట్ర సర్కారు అమలు చేస్తున్న అమ్మ ఒడి, కేసీఆర్ కిట్ పథకాలు సత్ఫలితాలిస్తున్నాయి. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య భారీగా పెరుగుతున్నది. గత ఐదేండ్లలో వికారాబాద్ జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో 36,731 ప్రసవాలు జరుగగా, అందులో 80 శాతం సాధారణ ప్రసవాలు జరుగడం విశేషం. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 37,176 కేసీఆర్ కిట్ల పంపిణీ చేయగా, అమ్మ ఒడి పథకంలో భాగంగా రూ.25 కోట్ల వరకు ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందజేసింది. మెరుగైన వైద్యం, ఉచితంగా మందులను అందజేస్తుండడంతో సర్కారు దవాఖానలకు వచ్చేవారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వికారాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ప్రభుత్వ దవాఖానలకు మంచి రోజులొచ్చాయి. గతంలో సర్కార్ దవాఖాన అంటే ప్రజలు వెళ్లేందుకు ఇష్టపడేవారు కాదు. కానీ.. సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రభుత్వ దవాఖానలపై ప్రత్యేక శ్రద్ధ చూపడంతో మెరుగైన వైద్యంతోపాటు సకల సౌకర్యాలు రోగులకు అందుతున్నాయి. అంతేకాకుండా ప్రసవాల సంఖ్య కూడా పెరుగడం గమనార్హం. ప్రధానంగా 2017 జూన్ నెలలో ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన కేసీఆర్ కిట్, అమ్మఒడి పథకాలతో సర్కారు దవాఖానలకు గర్భిణులు క్యూ కడుతున్నారు. ప్రభుత్వ దవాఖానల్లో డెలివరీ అయితే 16 వస్తువులతో కూడిన కేసీఆర్ కిట్తోపాటు అమ్మఒడి పథకంలో భాగంగా నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తుండటంతో గర్భిణు లు ప్రైవేట్ దవాఖానల వైపు వెళ్లడంలేదు. అంతేకాకుండా ప్రైవేట్, కార్పొరేట్ దవాఖానలకు దీటుగా సర్కారు దవాఖానల్లో మెరుగైన వైద్యం రోగులకు అందుతుండటంతో రోజురోజుకూ ప్రభుత్వ దవాఖా నలకు వచ్చే వారి సంఖ్య పెరుగుతున్నదని జిల్లా వైద్యాఆరోగ్య శాఖ అధికారులు పేర్కొంటున్నారు. కాగా గత ఐదేండ్ల కాలంలో 37,176 మంది లబ్ధిదా రులకు కేసీఆర్ కిట్లను పంపిణీ చేయగా.. అమ్మఒడిలో భాగంగా రూ.25 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందజేసింది.
మెరుగైన వైద్యం..
రాష్ట్ర ప్రభుత్వం 2017 జూన్లో కేసీఆర్ కిట్లు, అమ్మఒడి పథకాలను తీసుకొచ్చింది. అంతకుముం దు డెలివరీలకోసం ప్రజలు ప్రైవేట్ దవాఖానలకే వెళ్లే పరిస్థితి ఉండేది. ప్రభుత్వ దవాఖానలంటే నమ్మకం ఉండేది కాదు. కానీ కేసీఆర్ కిట్లు, అమ్మఒడి పథకా ల అమలుతో సర్కారు దవాఖానలకు వచ్చే గర్భిణుల సంఖ్య పెరుగుతున్నది. ఇక్కడ డెలివరీ అయిన వారికి 16 రకాల వస్తువులతో కూడిన కిట్ను పం పిణీ చేయడంతోపాటు నగదు ప్రోత్సాహకాన్ని కూ డా అందిస్తున్నారు. ఈ ప్రోత్సాహకాన్ని నాలుగు విడుతల్లో ప్రభుత్వం లబ్ధిదారులకు అందిస్తున్నది. మొదటి విడుతలో భాగంగా ప్రభుత్వ దవాఖానలో గర్భిణిగా పేరు నమోదు చేసుకోవడంతోపాటు వైద్య పరీక్షలు, టీటీ ఇంజక్షన్, ఐరన్ మాత్రలు తీసుకున్నట్లయితే రూ.3 వేలు, రెండో విడుతలో భాగంగా ప్రసవమైన వెంటనే రూ.4 వేలు, ఆడపిల్ల జన్మిస్తే రూ.5 వేలు సాయాన్ని అందిస్తున్నారు.
37,176 కేసీఆర్ కిట్ల పంపిణీ..
వికారాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 37,176 కేసీఆర్ కిట్లను లబ్ధిదారులకు అందజేశారు. 2017 జూన్ నెల నుంచి ఈ పథకం అమలవుతుండగా.. ఈ పథకంతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో డెలివరీల సంఖ్య పెరుగుతున్నది. గతంలో జిల్లాలోని సర్కారు దవాఖానల్లో నెలకు 150 వరకు ప్రసవాలు జరుగగా.. కేసీఆర్ కిట్ల పంపిణీ అమలైన తర్వాత జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య నెలకు 450 వరకు పెరిగినట్లు వైద్యాధికారు లు పేర్కొంటున్నారు. గత ఐదేండ్ల కాలంలో పంపిణీ చేసిన కేసీఆర్ కిట్లు… 2017-18 ఆర్థిక సంవత్సరం లో 5,370 కిట్లు, 2018-19లో 6,382, 2019-20లో 6,165, 2020-21లో 6,920, 2021- 22లో 7,721, ఈ ఏడాది ఇప్పటివరకు 4,618 కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు. అదేవిధంగా జిల్లాలో ప్రసవాల సంఖ్య కూడా పెరిగింది. గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో సరైన వసతుల్లేక, సిబ్బంది తక్కువగా ఉండటంతో డెలివరీలకోసం ప్రభుత్వ దవాఖానలకు గర్భిణులు రావాలంటే భయపడేవారు. కానీ కేసీఆర్ సీఎం అయిన తర్వాత ప్రభుత్వ దవాఖానలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.
మౌలిక వసతులను కల్పిస్తూ.. ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో గత ఐదేం డ్ల కాలంలో ప్రసవాల సంఖ్య భారీగా పెరిగింది. 2017 -18 ఆర్థిక సంవత్సరంలో 6,003 ప్రసవాలు, 2018 -19లో 6,943, 2019-20లో 7,881 , 2020-21లో 8,626, 2021-22లో 9,957, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 5,938 డెలివరీలు జరిగాయి. తాండూరు జిల్లా దవాఖానలో నెలకు 500లకుపైగా, వికారాబాద్ ఏరియా దవాఖానలో నెలకు 200 వరకు ప్రసవాలు జరుగుతున్నా యి. ప్రభుత్వ దవాఖానల్లో జరుగుతున్న డెలివరీల్లో 80 శాతం వరకు సాధారణ ప్రసవాలే ఉండడం గమనార్హం.
కార్పొరేట్కు దీటుగా..
ప్రభుత్వం సర్కారు దవాఖానలను కార్పొరేట్కు దీటుగా అభివృద్ధి చేయడంతో పాటు అవసరమైన అన్ని వసతులను సమకూర్చుతున్నది. కేసీఆర్ కిట్, అమ్మఒడి పథకాలతో ప్రభుత్వ దవాఖానలకు మళ్లీ మంచి రోజులొచ్చా యి. రోజురోజుకూ ప్రసవాల సంఖ్య పెరుగుతున్నది. తాండూరు జిల్లా దవాఖానలో నెలకు 500లకుపైగా డెలివరీలు జరుగుతున్నాయి. వా టితోపాటు 102 సేవలు, అసంక్రమిత వ్యాధుల సర్వే కూడా నిర్వహిస్తున్నాం. బీపీ, షుగర్ లాం టి వ్యాధులకు మెరుగైన చికిత్స అందిస్తున్నాం. ప్రజలు ప్రభుత్వ దవాఖానలను సద్వినియోగం చేసుకుని మెరుగైన వైద్యం పొందాలి.
– డాక్టర్ పల్వన్కుమార్, డీఎంహెచ్వో వికారాబాద్
పేదలకు వరం.. కేసీఆర్ కిట్
ప్రైవేట్ దవాఖానల్లో ఖరీదైన వైద్యం చేయించుకోలేక పేదలు ఇబ్బంది పడుతున్నారు. ప్రైవేట్ దవాఖానల్లో డెలివరీలకు వేలాది రూపాయలు ఖర్చుఅవుతుంది. అందువల్ల గర్భిణులు ప్రభుత్వ దవాఖానల్లోనే ప్రసవాలు చేయించుకోవాలి. సీఎం కేసీఆర్ ప్రభుత్వం సర్కారు దవాఖానలకు ఎంతో అభివృద్ధి చేసింది. అక్కడ మెరుగైన వైద్యం అందుతున్నది. నేను తాండూరు లోని జిల్లా దవాఖానలో డెలివరీ కాగా అక్కడి వైద్యులు చూశారు. కేసీఆర్ కిట్ కూడా అందించారు. చాలా సంతోషంగా ఉన్నది.
– మాధవి, తరిగోపులగ్రామం
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు
సీఎం కేసీఆర్ అందజేస్తున్న కేసీఆర్ కిట్ చాలా బాగుంది. పిల్లలకు ఉపయోగపడే అన్ని వస్తువులు అందులో ఉన్నాయి. సబ్బులు, నూనెలు, పౌడర్, పరువు, దుస్తులు చాలా బాగున్నాయి. గర్భిణుల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు. తాండూ రు జిల్లా దవాఖానలో గర్భిణులకు మెరుగైన వైద్యం అందుతున్నది. – సంధ్య, గౌతాపూర్ గ్రామం