మొయినాబాద్, మే 17 : ఏడాది పొడవునా బంతిని సాగుచేసే వీలుంది. పండుగ సీజన్లో బంతి సిరుల వర్షం కురిపిస్తుంది. చీడ పీడల పట్ల రైతు జాగ్రత్తలు పాటిస్తే అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. వినాయక చవితి, బతుకమ్మ, దసరా, దీపావళి, కార్తీకమాసంలో పూజల కోసం బంతిపూలను విరివిగా ఉపయోగిస్తారు. రైతులు ఎక్కువకాలం..ఎక్కువ ఖర్చుతో కూడుకున్న వాణిజ్య పంటలకంటే బంతి సాగు తక్కువ కాలంలో, తక్కువ ఖర్చుతో లాభాలు అధికంగా వస్తాయి. కరువుకాలంలోనూ పూలతోటలను సాగుచేస్తూ ఉపాధిని పొందడానికి అవకాశం ఉంటుంది. ఉగాది పండుగ చివరి వరకు దిగుబడి వచ్చేలా ప్రణాళికాబద్ధంగా బంతిపూలు సాగు చేసుకోవాలని ఉద్యానవనశాఖ అధికారులు చెబుతున్నారు.
బంతి సాగుకు సూచనలు, సలహాలు..
ప్రణాళికను బట్టి ఏ రోజుకు పంట కోత ఉంటుందో, ఆ రోజు నుంచి ఎప్పుడు నారు పోయాలి? ఎప్పుడు నాటాలి.? నాటిన తరువాత ఎన్ని రోజులకు పూలు కోతకు వప్తాయి ..? అనే విషయాల గురించి రైతులకు మంచి అవగాహన ఉంటే బంతి సాగులో మంచి లాభాలు సాధించవచ్చు. ముఖ్యంగా బంతి కాలానుగుణంగా పెరుగుదల కనిపిస్తుంది. ఎలా అంటే.. వర్షాకాలంలో మొక్కలు త్వరగా పెరిగి, తర్వగా పూతకు వస్తాయి. అదే శీతాకాలంలో మొక్కల్లో పెరుగుదల ఆ స్థాయిలో కనిపించదు. గిడసబారినట్లుగా ఉంటాయి. అయినా త్వరగా పూతకు వస్తాయి. అదే వేసవికి ముందు మొక్కల్లో మంచి పెరుగుదల కనిపిస్తుంది. కానీ పూల దిగుబడిలో నాణ్యత లోపిస్తుంది.
బంతినారు పెరుగుదల 20-25 రోజులు, నాటిన 45-50 రోజులకు మొక్కలు మొదటి పూతకు వస్తాయి. మొదటి పూత నుంచి 30-35 రోజుల వరకు చివరి పూత పూర్తవుతుంది. దీని ఆధారంగా రైతులు పంట ప్రణాళిక చేసుకోవాలి.
బంతి సాగులో కత్తిరింపులు, సూక్ష్మపోషకాల వినియోగం, సస్యరక్షణ చర్యలు అధిక దిగుబడి సాధించడానికి చాలా కీలకం.
కత్తిరింపులు ఎప్పుడు చేయాలి..
మొక్కలకు సాధారణంగా 20-25 సెం.మీ ఎత్తు పెరిగిన తర్వాత తలలు తుంచాలి. దీని వల్ల పక్క కొమ్మలు ఎక్కువగా వస్తాయి. మొదట సంక్రమణ విత్తనం (ఎఫ్, హైబ్రిడ్ సీడ్స్)కి కత్తిరింపులు అవసరం లేదు.
సాధారణంగా మొక్కలు పెరిగిన తర్వాత నాటిన 25-30 రోజులకు మొక్కలకు సూక్ష్మ పోషకాలు అవసరం. అప్పుడు ఫార్ములా 4ని 2.5 గ్రాములు లీటరు నీటిలో కలిపి ప్రతి 10-12 రోజులకోసారి పిచికారీ చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు.
పూల కోత..
బంతి పూలను బాగా విచ్చుకున్న తర్వాత కోయాలి. పూల కోతకు ముందు రోజు తడి వచ్చి పూలు కోయడం వల్ల పూలు ఎక్కువ కాలం తాజాగా నిల్వ ఉంటాయి. పూలను ఉదయం లేదా సాయంత్రం సమయంలో కోయాలి.
పంటకాలంలో 4-5 సార్లు పూల కోతలు ఉంటాయి. సకాలంలో పూల కోతలు చేస్తే ఎకరాకు 7-8 టన్నుల పూల దిగుబడిని ఆశించవచ్చు.పూల నాణ్యత చెడకుండా తొడిమ ఒకటిన్నర అంగుళాలు పొడవులో కోయాలి. దీని వల్ల నాణ్యత బాగుతుంది.
సమగ్ర సస్యరక్షణ చర్యలు..
పొడి వాతావరణ పరిస్థితిల్లో తామర పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల మొగ్గలు గోధుమ రంగుకి మారిఎండిపోతాయి. నివారణకు ప్రిఫోనిల్ 1.5 మి.లీ.లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
మొగ్గ తొలిచే పురుగును గమనిస్తే ఫెన్వలరేట్ను లీటరు నీటికి 2 ఎం.ఎల్ లేదా కరాటే 2.5 ఎంఎల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి వర్షాకాలం ఆరభంలో నాటిన మొక్కలకు ఆకుపచ్చ తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. ఆకులపై నల్లని మచ్చలు, ఆకులు త్వరగా రాలిపోతాయి. దీని నివారణకు మెనోమిల్ 2 గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
తక్కువ నీరు..
ఈ పంటకు నీరు అంతగా అవసరం ఉండదు. వారానికి ఒకసారి నీటిని పెడితే సరిపోతుంది. నీటి యాజమాన్యానికి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నిర్వహిస్తే మరింత నీరు ఆదా అవుతుంది. మొక్కలు హైబ్రిడ్ రకాలు రావడంతో తెగులు సోకే అవకాశం ఉంటుంది. ఆకు ముడుత పురుగు నివారణ కోసం ఉద్యానవనశాఖ అధికారుల సూచనల మేరకు క్రిమి సంహారక మందులు వాడాలి. సేంద్రియ పద్ధతులైన వేప నూనె పిచికారీ చేస్తే పురుగుల బెడదను తగ్గించవచ్చు. మొక్కలకు యూరియా, డీఏపీ లాంటి రసాయనిక ఎరువులతో పాటు వేప పిండిని వేస్తే మొక్క ఎదుగుతుంది. మొక్కలు నాటకముందు దుక్కిలోనే సేంద్రియ ఎరువులు వేస్తే రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించవచ్చు.
కాలానికి అనుగుణంగా దిగుబడి వస్తుంది..
కాలానికి అనుగుణంగా బంతి పూల దిగుబడి వస్తుంది. వర్షాకాలంలో మొక్కలు త్వరగా పెరిగి, పూతకు వస్తాయి. అదే శీతాకాలంలో మొక్కల్లో పెరుగుదల ఆ స్థాయిలో కనిపించదు. గిడసబారినట్లుగా ఉంటాయి. త్వరగా పూతకు వస్తాయి. అదే వేసవికి ముందు మొక్కల్లో మంచి పెరుగుదల కనిపిస్తుంది. కానీ పూల దిగుబడిలో నాణ్యత లోపిస్తుంది. సస్యరక్షణ చర్యలు తప్పకుండా పాటించాలి. ఏడాది పొడవునా బంతి సాగును చేయవచ్చు. పంటకు ఎలాంటి చీడ పీడలు ఆశించినా అధికారులను సంప్రదించి మందులు పిచికారీ చేయాలి.
– రాగమ్మ, మండల వ్యవసాయ అధికారి