ఇబ్రహీంపట్నం, మే 4 : అన్నదాతకు అరచేతిలో వైకుంఠం చూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతన్నల ఉసురు తీస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మండిపడ్డారు. సోమవారం ఇబ్రహీంపట్నంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద మరణించిన రైతు మంగలి గౌరయ్య చావుకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని.. ఆయన కుటుంబానికి రూ.25లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎండాకాలంలో తేమ శాతం పేరిట అన్నదాతలను రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు చేయించడం సిగ్గుచేటని విమర్శించారు. యాసంగి వరి కోతలు పూర్తికావస్తున్నా ధాన్యం కొనుగోలు ఇంకా మొదలుకాలేదన్నారు.
స్వయంగా స్థానిక ఎమ్మెల్యే వారం రోజుల క్రితం ప్రారంభించిన కొనుగోలు కేంద్రాల్లో నేటికీ కనీసం ఒక్క గింజ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయలేదని చెప్పారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 15 కొనుగోలు కేంద్రాల్లో సుమారు 70వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉండగా.. కనీసం రెండువేల క్వింటాళ్లు కూడా నేటికీ కొనుగోలు చేయలేదన్నారు. రైతులు తాము పండించిన పంటలను దళారులకు అమ్ముకున్నాకే సర్కారు కొనుగోలు కేంద్రాలు తెరిచే పరిస్థితి కనిపిస్తున్నదని చెప్పారు. అన్నదాతల నుంచి ధాన్యం కొనుగోలు చేయకుండా, వారికి బోనస్ డబ్బులు కూడా ఇవ్వకుండా మోసం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తున్నదని మండిపడ్డారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తడిసిన ధాన్యాన్ని కూడా రైతుల నుంచి కొనుగోలు చేశామని తెలిపారు. 70వేల మంది అన్నదాతల ఖాతాల్లో 11 విడుతల్లో నేరుగా 78వేల కోట్ల రైతు బంధు నిధులు జమ చేశామని చెప్పారు. నాణ్యమైన 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చామని.. ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించామని వివరించారు. వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి, కోళ్ల పరిశ్రమ, గొర్రెల పెంపకం, చేపల పెంపకం, హార్టికల్చర్, సెరీకల్చర్, ఫ్లోరీకల్చర్ తదితర రంగాల్లో సమృద్ధిగా అభివృద్ధి సాధించామని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో తిరిగి రైతులకు కష్టాలు వచ్చాయని, అన్నదాతలు అరిగోస పడుతున్నారని ధ్వజమెత్తారు.
కర్మానికి కాంగ్రెస్ను తెచ్చుకున్నామని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారన్నారు. ఇకనైనా కాంగ్రెస్ పాలకులు రైతుల సమస్యలపై దృష్టి సారించాలని, లేదంటే అన్నదాతలతో కలిసి సర్కారుపై తిరగబడతామని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు తగిన వసతులు కల్పించాలని, వెంటనే ధాన్యం కొనుగోలు చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ వెంకటరమణారెడ్డి, ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ సుదర్శన్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చంద్రయ్య పాల్గొన్నారు.