‘మన ఊరు-మన బడి’తో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోతున్నాయి. వికారాబాద్ జిల్లావ్యాప్తంగా చాలాచోట్ల పనులు పూర్తికాగా, కొన్ని స్కూళ్లలో వివిధ దశల్లో పనులు సాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా కొత్తగా ఇంగ్లిష్ మీడియంలో బోధనను ప్రవేశపెట్టడంతోపాటు భవనాలకు మరమ్మతులు, అదనపు తరగతి గదులు, కిచెన్ షెడ్ల నిర్మాణం, పెయింటింగ్, ప్రహరీలు, తాగునీరు, ఫర్నిచర్, మరుగుదొడ్లు వంటి వసతులు కల్పిస్తున్నారు. జిల్లాలో మొదటి విడుతలో భాగంగా 371 స్కూళ్లలో పనులు చేపట్టారు. అందులో 41 స్కూళ్లలో పనులు పూర్తికాగా, ఇప్పటికే 33 స్కూళ్లను ప్రారంభించారు. విద్యార్థులు ఉదయం పూట ఏమీ తినకుండా వస్తారన్న ఉద్దేశంతో ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం రాగిజావను అల్పాహారంగా అందిస్తున్నది.
-వికారాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ)
ప్రభుత్వ బడులే బాగున్నాయ్: సుదర్శన్, కోట్పల్లి
సర్కారు బడులు మౌలిక సదుపాయాలతో కళకళలాడుతున్నాయి. మన ఊరు-మన బడి కార్యక్రమంతో పాఠశాలలు కొత్తరూపు సంతరించుకున్నాయి. విద్యార్థులకు నిష్ణాతులైన ఉపాధ్యాయులతో బోధన, సన్నబియ్యంతో కూడిన మధ్యాహ్న భోజనం, తాగునీరు, ఉచితంగా దుస్తులు, పుస్తకాలు అందిస్తున్నారు. ప్రైవేటు కన్నా ప్రభుత్వ బడులు బాగున్నాయి. నా కుమారుడు కోట్పల్లి ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. పైసా ఖర్చు లేకుండా చదువు లభిస్తున్నది.
వికారాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ) : పేద విద్యార్థులకు కేజీ టూ పీజీ విద్యనందించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతూ ముందుకెళ్తున్నది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయి. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యతనివ్వడంతోపాటు కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా సర్కార్ బడులను తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టారు. గతేడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ పాఠశాలలను ప్రారంభించడం, నాణ్యమైన విద్యనందించడంతోపాటు మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, స్కూల్ యూనిఫాంలను కూడా అందిస్తుండడం వంటి బలోపేత కార్యక్రమాలను సర్కారు చేపట్టింది. విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు ఎప్పటికప్పుడు ప్రభుత్వ పాఠశాలలవైపు దృష్టి సారించిన రాష్ట్ర సర్కార్ బడుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన అన్ని చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగా ‘మన ఊరు-మన బడి’కి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, రెండు జతల యూనిఫాంలను అందజేస్తుండగా ఈ ఏడాది నుంచి ఉచితంగా నోటు పుస్తకాలను కూడా పంపిణీ చేస్తున్నది. ఈ విద్యా సంవత్సరం పాఠశాలలు తెరిచిన మొదటి రోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలను అందజేశారు.
మారిన మధ్యాహ్న భోజన పథకం మెనూ
సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యతతో కూడిన భోజనాన్ని ప్రభుత్వం అందిస్తున్నది. దూర ప్రాంతాల నుంచి ప్రభుత్వ స్కూళ్లకు వచ్చే విద్యార్థులకు ఉదయం పూట ఏమీ తినకుండా వస్తారన్న ఉద్దేశంతో ఈ విద్యా సంవత్సరం నుంచి ఉదయం రాగి జావను అల్పాహారంగా అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రైమరీ స్కూళ్లలో వారానికి మూడు రోజులపాటు రాగి జావను విద్యార్థులకు అందిస్తున్నారు. అలాగే నాణ్యతతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని కూడా అందిస్తున్నది. అయితే ఈసారి మధ్యాహ్న భోజన పథకం మెనూను మార్చింది. వారంలో ఒక రోజు వెజిటేబుల్ బిర్యానీ, ఒక రోజు కిచిడీ అందజేస్తున్నారు.
మన ఊరు-మన బడితో మారిన రూపురేఖలు
సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులను తీసుకువచ్చేందుకు చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోతున్నాయి. సర్కారు స్కూళ్లలో సకల వసతులు కల్పించడంతో కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా రూపుదిద్దుకున్నాయి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మొదటి విడుతలో ఎంపిక చేసిన స్కూళ్లలో మండలానికి, మున్సిపాలిటీకి రెండు చొప్పున ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసి సంబంధిత స్కూళ్లలో అవసరమైన మౌలిక సదుపాయాలను గుర్తించి పనులు పూర్తి చేశారు. జిల్లావ్యాప్తంగా 41 స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పన పనులు పూర్తికాగా, ఇప్పటివరకు 33 స్కూళ్లను ప్రారంభించారు.
ఎంపిక చేసిన పాఠశాలల్లో తాగునీరు, ఫర్నిచర్, మరుగుదొడ్లు, విద్యుత్తు, గ్రీన్ చాక్బోర్డులు, పెయింటింగ్, ప్రహరీలు, కిచెన్ షెడ్లు, తరగతి గదుల నిర్మాణం, మరమ్మతులు, డిజిటల్ విద్యకు అవసరమైన ఏర్పాట్లు, ఉన్నత పాఠశాలల్లో డైనింగ్ హాళ్లను సంబంధిత ప్రభుత్వ పాఠశాలల్లోకి అందుబాటులోకి తీసుకువచ్చారు. జిల్లావ్యాప్తంగా 1054 ప్రభుత్వ పాఠశాలలుండగా వీటిలో మొదటి విడుతలో 371 స్కూళ్లలో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎంపిక చేసిన స్కూళ్లలో ఉన్నత పాఠశాలలు-111, ప్రాథమికోన్నత పాఠశాలలు-40, ప్రాథమిక పాఠశాలలు-220 ఉన్నాయి. ఈ పాఠశాలల్లో ఇప్పటివరకు 41 స్కూళ్లలో దాదాపు పనులన్నీ పూర్తయ్యాయి. మిగతా స్కూళ్లలో 50 శాతానికిపైగా పనులు పూర్తి కావడంతోపాటు ఆయా స్కూళ్లలో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు అంచనాలు పూర్తయిన 371 స్కూళ్లలో మౌలిక సదుపాయాల పనులను చేపట్టేందుకు ఇప్పటివరకు జిల్లాకు రూ.144 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.
సర్కారు నిర్ణయం చాలా సంతోషంగా ఉంది : శ్రీధర్గౌడ్, నాగారం, ధారూరు
తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా సంతోషంగా ఉంది. సర్కారు బడుల్లో సకల సౌకర్యాలు కల్పించడంతోపాటు విద్యార్థులకు దుస్తులు, పుస్తకాలు, నోటుపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, విశాలమైన తరగతి గదులు, ఆటస్థలం అనుభవజ్ఙులైన, అత్యున్నత అర్హత ఉన్న ఉపాధ్యాయులతో బోధన కల్పించడం అభినందనీయం. మన ఊరు – మన బడి కార్యక్రమాల్లో బడులను ఎంతో సుందరంగా తీర్చిదిద్దుతున్నది. ఇందుకు సీఎం కేసీఆర్కు విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున కృతజ్ఞతలు.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు : కోస్గి వెంకట్, మందిపల్, కులకచర్ల మండలం
ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో నేడు గ్రామాల్లో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లేందుకు మక్కువ చూపిస్తున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, మధ్యాహ్న భోజనం, దుస్తులు, నోటు, పాఠ్యపుస్తకాలతోపాటు కొత్తగా రాగిజావను అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. సీఎం కేసీఆర్ విద్యాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నిధులు కేటాయిస్తున్నారు.
పాఠశాలల రూపురేఖలు మారాయి : పాండు, అంతారం ప్రాథమికోన్నత పాఠశాల కమిటీ చైర్మన్
మన ఊరు – మన బడితో పాఠశాలలకు మహర్దశ వచ్చింది. మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం నిధులను కేటాయించడంతో అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నాం. పాఠశాలలు కార్పొరేట్కు దీటుగా తయారయ్యాయి. గతంలో పాఠశాలల్లో ఎన్నో సమస్యలు ఉండేవి.
సర్కారు బడుల్లో సకల సౌకర్యాలు : నర్సింహారెడ్డి, మోమిన్ఖుర్దు, ధారూరు మండలం
ప్రభుత్వం సర్కారు బడుల్లో సకల సౌకర్యాలు కల్పించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఎవరూ చేయని విధంగా సీఎం కేసీఆర్ పాఠశాలలను అందంగా తీర్చిదిద్దారు. గతంలో తాగునీరు, మరుగుదొడ్లు కూడా ఉండేవి కావు. విద్యార్థులకు ఉచితంగా ఉచితంగా దుస్తులు, పుస్తకాలు, నోట్ బుక్కులు, నాణ్యమైన మధ్యాహ్న భోజనం, విశాలమైన తరగతి గదులు, ఆట స్థలాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు.
మా పాఠశాల బాగైంది : లచ్చానాయక్, చెట్టుపల్లితండా, దుద్యాల మండలం
మన ఊరు – మన బడితో మా తండా పాఠశాల బాగైంది. ఇంతకు ముందున్న బడుల్లో విద్యార్థులకు సరైన సౌకర్యాలు లేకుండే. ఇప్పుడు తాగడానికి నీటి సౌకర్యం, మరుగుదొడ్లు, కూర్చోవడానికి బెంచీలు, కరెంటు అన్ని సౌకర్యాలు కల్పించారు. ప్రైవేటు పాఠశాల కంటే మంచిగా తయారుచేశారు. సీఎం కేసీఆర్ చదువు కోసం శ్రద్ధ చూపిస్తున్నారు.
ప్రభుత్వ బడులు కార్పొరేట్ స్థాయిలో : తుప్పలి అశోక్కుమార్, ఉపాధ్యాయుడు, కులకచర్ల
ప్రభుత్వ బడులు కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చెందాయి. సర్కారు బడుల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించడం ద్వారా మొదటి దశలో ఎంపిక చేసిన పాఠశాలల్లో ఇప్పటికే పలు మౌలిక సదుపాయాలను కల్పించారు. ఇదంతా సీఎం కేసీఆర్ కృషి ఫలితమే.
విద్యతోపాటు ఆరోగ్యం : సుభాన్, చంద్రయాన్పల్లి, మోమిన్పేట
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలల పునరుద్ధరణకు బీఆర్ఎస్ సర్కారు ఎంతో కృషి చేస్తున్నది. పట్టణం లాంటి విద్యా సౌకర్యాలు గ్రామీణ విద్యార్థులకు అందించాలనే లక్ష్యంతో మన ఊరు – మన బడి కార్యక్రమంతో సకల సౌకర్యాలతో సర్కారు బడులను తీర్చిదిద్దింది. దీంతో నేడు గ్రామాల్లో విద్యార్థులులు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లేందుకు మక్కువ చూపిస్తున్నారు. అర్హత కలిగిన ఉపాధ్యాయులతో విద్యా బోధన, నాణ్యమైన మధ్యాహ్న భోజనం, విటమిన్లు కలిగిన రాగి జావను సర్కారు బడుల్లో అందిస్తున్నారు. అలాగే విద్యార్థులకు కావలసిన యూనిఫాం, పుస్తకాలను ప్రభుత్వం పూర్తిగా ఉచితంగా అందిస్తున్నది. ఇంత గొప్ప సౌకర్యాలున్న మా ఊరు చంద్రయాన్పల్లి ప్రభుత్వ పాఠశాలలోనే మా పిల్లలను చదివిస్తున్నా. పిల్లలు అసక్తిగా పాఠశాలకు వెళ్లి విద్యనభ్యసిస్తున్నారు.