న్యూఢిల్లీ : ఇథనాల్ కలిపిన ఇంధనానికి వ్యతిరేకంగా ‘ఈ20 జనతా పార్టీ’ పేరుతో సోషల్ మీడియాలో పుట్టుకొచ్చిన కొత్త డిజిటల్ సంఘం జోరు కొనసాగుతున్నది. పేపర్ లీకేజీల అంశంపై యువతను ఏకం చేసిన ‘కాక్రోచ్’ ఉద్యమం స్ఫూర్తితో ఈ సరికొత్త రాజకీయ వేదిక రూపుదిద్దుకుంది. ప్రస్తుతం ఈ పార్టీకి ఇన్స్టాగ్రామ్లో 2,18,000 మంది ఫాలోవర్లు ఉండగా, ఈ సంఖ్య నిమిషనిమిషానికి పెరుగుతోంది. రాయితీ ధరకు వంద శాతం స్వచ్ఛమైన ఇంధనాన్ని ఎంచుకునే స్వేచ్ఛ కల్పించాలని, అలాగే ఈ20 ఇంధనంపై విమర్శలు ఎదుర్కొంటున్న కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి గడ్కరీ రాజీనామా చేయాలని ఈ వేదిక డిమాండ్ చేస్తోంది. ఈ20 ఇంధనం వల్ల మైలేజీ తగ్గిపోతున్నదని, వాహనాల ఇంజిన్లు దెబ్బ తింటాయని ఈ వేదిక ఆందోళన వ్యక్తం చేస్తోంది. కాగా ఇథనాల్ ఇంధనం సురక్షితమైనదని, పరిశ్రమ ప్రమాణాలకు అనుగుణంగా ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఈ10 ప్రమాణాలున్న వాహనాల్లో ఈ20 ఇంధనాన్ని వాడినప్పుడు మైలేజ్ స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం అంగీకరించింది. ఏదిఏమైనా ‘ఈ20 జనతా పార్టీ’ పరిణామాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సరికొత్త చర్చకు దారి తీస్తున్నాయి.
ఇథనాల్ పెట్రోల్ మీద కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్నది. సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా ఈ-20 పెట్రోల్ వల్ల కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కుటుంబం లాభపడుతోందని వేలాది మంది పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే నితిన్ గడ్కరీ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తమ కుటుంబం ఈ-20 పెట్రోల్ వల్ల లాభపడుతున్నదని పరువు నష్టం కలిగించేలా, డీప్ ఫేక్ పోస్టులు పెడుతున్నారంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఆయా సోషల్ మీడియా సంస్థలు, పోస్టులు పెడుతున్న వారిపై సివిల్ కేసులు పెట్టడానికి అనుమతివ్వాలని ఆయన పిటిషన్లో కోరారు. ఈ-20 పెట్రోల్ పాలసీ వల్ల తనకు రూపాయి లాభం లేదని.. తనకున్న ఇథనాల్ ఫ్యాక్టరీల నుంచి కూడా అంతంత మాత్రంగానే లాభాలు వస్తున్నాయంటూ పేర్కొన్నారు. నితిన్ గడ్కరీ పిటిషన్కు కోర్టు అనుమతిచ్చింది. కాగా, ఆగస్టు 1న ఈ-20 పెట్రోల్కు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగే చర్చల్లో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలని ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. ఈ-20ని వెనక్కు తీసుకునేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని చెప్పారు.