మన ఊరు-మన బడిలో భాగంగా ప్రభుత్వ స్కూళ్లను ప్రైవేటు బడులకు దీటుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లోని కోర్టుహాల్లో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిసి ఆమె సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ బడులకు మహర్దశ రానుందన్నారు. మన ఊరు-మన బడి పనులను ఒక యజ్ఞంలా చేపట్టి పాఠశాలలు పునఃప్రారంభమయ్యే సరికి పూర్తిచేయాలన్నారు. అవసరమైతే స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థులను భాగస్వాములను చేయాలన్నారు.
రంగారెడ్డి, మే 19, (నమస్తే తెలంగాణ) : మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా సకల సౌకర్యాలను కల్పించి కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్లోని కోర్టు హాల్లో మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి కార్యక్రమంపై విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టనుందన్నారు. మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా చేపట్టి పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి సకల సౌకర్యాలతో సిద్ధమయ్యేలా పనులు చేపట్టాలని కలెక్టర్, అధికారులను మంత్రి ఆదేశించారు.
రంగారెడ్డి జిల్లాలో మొదటి విడుతలో 464 పాఠశాలలను ఎంపిక చేశామని, వీటిలో గ్రామీణ ప్రాంతంలో 304 పాఠశాలలను, పట్టణ ప్రాంతంలో 160 పాఠశాలలను ఎంపిక చేశామన్నారు. ఈ పనులతో దాదాపు 65 శాతం విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా అవసరమైన లైబ్రరీ, ప్రహరీ, కిచెన్ షెడ్స్, డైనింగ్ హాల్స్, మరుగుదొడ్లు, నీటి వసతి, డిజిటల్ విద్యాబోధనకు అవసరమైన పనులను చేపట్టి పూర్తి చేయాలని సంబంధిత అధికారులను మంత్రి సబితారెడ్డి ఆదేశించారు. అవసరమైన పనులను మాత్రమే గుర్తించి పాఠశాలలను ప్రారంభించే నాటికి అధికారులు, ప్రజాప్రతినిధులు, అన్ని వర్గాలవారు సమష్టిగా పనిచేస్తూ ప్రభుత్వ బడులను బాగు చేసుకుందామన్నారు. మరోవైపు ఆర్థికంగా ఉన్నత స్థానాల్లో ఉన్న పూర్వ విద్యార్థులు తాము చదువుతున్న బడులకు విరివిగా విరాళాలు అందించి ప్రభుత్వ బడుల అభ్యున్నతి కోసం తోడ్పాటునందించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. పాఠశాలల నిర్వహణ కమిటీ చైర్మన్లు, సర్పంచ్లు, ప్రధానోపాధ్యాయులు, పూర్వ విద్యార్థులను, ఇతర దాతలను సంప్రదించి ప్రభుత్వ బడులకు విరాళాలు సమకూర్చుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోని బడుల్లో మౌలిక వసతులు మెరుగుపడితే విద్యా ప్రమాణాలు మెరుగుపడుతాయని, దీంతో చక్కటి భవిష్యత్తును ఏర్పర్చుకునేందుకు దోహదపడుతుందని మంత్రి వెల్లడించారు.
ఈ విద్యాసంవత్సరం నుంచే ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని అమల్లోకి తీసుకువస్తామని మంత్రి తెలిపారు. జూన్ 1 నుంచి బడిబాట, జూన్ 3 నుంచి నిర్వహించే పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించి ప్రభుత్వ పాఠశాలల్లో అధిక మొత్తంలో చేరేలా చర్యలు చేపట్టాలన్నారు. ఆంగ్ల మాధ్యమం అమలులో భాగంగా ఇప్పటికే ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారన్నారు.
జిల్లాలో మొదటి విడుతలో ఎంపిక చేసిన 464 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించే పనులను చేపట్టేందుకుగాను పరిపాలన అనుమతులిచ్చినట్లు కలెక్టర్ అమయ్కుమార్ తెలిపారు. పనులు సకాలంలో పూర్తి చేసేలా చర్యలు చేపడుతామన్నారు. ప్రభుత్వ సూచనలను పాటిస్తూ పాఠశాలలు పునఃప్రారంభంలోగా మౌలిక సదుపాయాల కల్పన పనులను పూర్తి చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో రాష్ట్ర విద్యా, మౌలిక సదుపాయాల కల్పన సంస్థ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్సీలు వాణీదేవి, పట్నం మహేందర్రెడ్డి, ఎగ్గే మల్లేశం, జనార్దన్రెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్రెడ్డి, అరికెపూడి గాంధీ, కాలె యాదయ్య, అంజయ్యయాదవ్, అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, డీఈవో సుశీంద్రరావు, జడ్పీ సీఈవో దిలీప్కుమార్ పాల్గొన్నారు.