రంగారెడ్డి, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని ఎమ్మెల్యేలకే మరోసారి అవకాశం కల్పించి టికెట్లను ఖరారు చేయడంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సిట్టింగ్లకే టికెట్లను కేటాయించినందుకు సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి నమ్మకాన్ని నిలబెడుతామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలంతా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వ అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలు అందేలా ఎనలేని కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఇవే రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకు సోపానాలు అవుతాయన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సీఎం కేసీఆర్ వల్లనే సాకారమవుతున్నదన్న నమ్మకం ఈప్రాంత ప్రజల్లో ఉన్నదన్నారు. ఈ ప్రాంతానికి ఫాక్స్కాన్ వంటి అనేక జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమలు తరలి వస్తున్నాయని, రాబోవు రోజుల్లో మెడికల్ కళాశాల, మెట్రో రైలు వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు అందుబాటులోకి రాబోతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ వెన్నంటే ప్రజానీకం ఉన్నదని, బీఆర్ఎస్ అభ్యర్థులు గెలువడం ఖాయమని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
మంత్రి సబితా ఇంద్రారెడ్డి బయోడేటా
పేరు : పట్లోళ్ళ సబితా ఇంద్రారెడ్డి
భర్త పేరు : పట్లోళ్ళ ఇంద్రారెడ్డి(లేట్), మాజీ హోంమంత్రి
పుట్టిన తేదీ : 05.05.1963
సంతానం : ముగ్గురు కుమారులు కార్త్తిక్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, కల్యాణ్రెడ్డి
విద్యార్హత : గ్రాడ్యుయేషన్(బిఎస్సీ)
రాజకీయ నేపథ్యం : 2004లో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఎమ్మెల్యేగా గెలు పొందారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి మంత్రివర్గంలో గనులశాఖ మంత్రిగా కొనసాగి ఐటీ, చేనేత, జౌళి శాఖలకు మంత్రిగా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. 2009లో మహే శ్వరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది హోం, జైళ్ల శాఖల మంత్రిగా పనిచేశారు. 2018లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి 2019లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్లో విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.