కొడంగల్, ఫిబ్రవరి 1 : అంకితభావంతో పనిచేస్తే ఉత్తమ గుర్తింపు లభిస్తుందని మండలంలోని హస్నాబాద్ గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికురాలు కంతి లక్ష్మి నిరూపించారు. చేస్తున్న పనిని ఊసడించుకోకుండా ప్రజల ఆరోగ్యమే పరమావధిగా ప్రతిరోజూ సచ్ఛ కార్యక్రమాల్లో ముం దున్న లక్ష్మి.. ఇటీవల జరిగిన గణతంత్ర వేడుకల్లో ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా జాతీయ స్థాయిలో ఉత్తమ పారిశుధ్య కార్మికురాలి అవార్డును అందుకున్నది. అంతేకాకుండా గ్రామ పంచాయతీకి అదనపు ఆదాయాన్ని సమకూర్చుతూ స్థానికులు, అధికారుల నుంచి ప్రశంసలు పొందుతున్నది. ఆమెకు నేషనల్ అవా ర్డు వరించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మండలంలోని హస్నాబాద్ గ్రామానికి చెందిన లక్ష్మిది పేద కుటుంబం. వారికి ఎకరా పొలం మాత్రమే ఉన్నది. వాస్తవానికి ఆమె చేస్తున్న ఉద్యోగం అప్పట్లో భర్త కంతి సైదప్ప నిర్వహించేది. అతడికి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో భర్త స్థానంలో ఆమె ఉద్యోగంలో చేరి అంకితభావంతో విధులు నిర్వహిస్తున్నది. తోటి ఉద్యోగులతో సఖ్యతగా ఉంటూ తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నది. డంపింగ్ యార్డులో వేసిన చెత్తాచెదారాన్ని వేరు చేసి.. అందులోని అట్టముక్కలు, గాజు సీసాలు, ప్లాస్టిక్తోపాటు సేంద్రియ ఎరువు అమ్మకంతో గ్రామ పంచాయతీకి అదనంగా ఆదాయా న్ని సమకూర్చుతున్నదని సర్పంచ్ ఫకీరప్ప తెలిపారు.
అదేవిధంగా గ్రామంలో తడి, పొడి చెత్తను వేరు చేయడంలో గ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్నది. ఆమె చేస్తున్న సేవలను గుర్తించిన జిల్లా అధికారులు అభినందించి ఉత్తమ అవార్డు ఎంపికకు ప్రభుత్వానికి నివేదికను పంపించారు. జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డుకు రాష్ట్రం నుంచి నలుగురు ఎంపిక కాగా అందులో హస్నాబాద్ గ్రామపంచాయతీ కార్మికురాలు లక్ష్మి ఒకరు. రెండు నెలల క్రితం గ్రామ పంచాయతీ పరిధిలో నిర్వహించిన స్వచ్ఛత కార్యక్రమంలో ఆమె కనబరిచిన సేవలు ప్రశంసనీయమని సర్పంచ్ కొనియాడారు. ఇటీవల గణతంత్ర వేడుకల్లో ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ఉత్తమ అవార్డును అందుకున్నట్లు తెలిపారు.
జాతీయ స్థాయిలో హస్నాబాద్ గ్రామానికి పేరు తీసుకొచ్చిన లక్ష్మిని సర్పంచ్తోపాటు పంచాయతీ కార్యదర్శి కృష్ణవేణి, గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఢిల్లీలో ప్రధాని నుంచి ఉత్తమ అవార్డు అందుకుని గురువారం గ్రామానికి చేరుకున్న ఆమెకు స్థానికులు ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి సన్మానించారు.
తీసుకుంటున్న వేతనానికి
తీసుకొంటున్న వేతనానికి న్యాయం చేస్తున్నా. నేను చేస్తున్న పని నాకు ఇంత పెద్ద స్థాయిలో గుర్తింపు తీసుకొస్తుందని కలలోనూ అనుకోలేదు. ప్రధాని మోదీ ద్వారా జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డును అందుకోవడం చాలా సంతోషంగా ఉన్నది.