భారీ వర్షాలు కురువడంతో రంగారెడ్డి జిల్లాలోని చెరువులు, కుంటలకు జలకళ వచ్చింది. పలు మండలాల్లోని చెరువులు అలుగు పారుతున్నాయి. అంతేకాకుండా ఇబ్రహీంపట్నంలోని పెద్ద చెరువు దాదాపు 45 ఏండ్ల తరువాత అలుగు పారింది. దీంతోపాటు యాచారం మండలం నందివనపర్తిలోని కాముని చెరువు, కొత్తూరు మండలం కొడిచెర్లలోని గార్ల చెరువు మత్తడి దుంకాయి. పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ పరిధిలోని చెరువులు, కుంటలు, చెక్డ్యాంలు నిండుకుండల్లా మారగా.. స్థానికులు సంబురాలు చేసుకుంటున్నారు.
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 7: ఇబ్రహీంపట్నం పెద్దచెరువు దాదాపు 45 ఏండ్ల తర్వాత అలుగు పారుతున్నది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతంలో ఉన్న చెరువులు, కుంటలు పూర్తిగా నిండిపోవడంతో ఇబ్రహీంపట్నం పెద్దవాగుతోపాటు రాచకాల్వ నుంచి పెద్ద ఎత్తున ఇబ్రహీంపట్నం పెద్దచెరువుకు వరద నీరు వచ్చి చేరుతున్నది. దీంతో ఇబ్రహీంపట్నం పెద్దచెరువు నీటిసామర్థ్యం సుమారు 39 అడుగుల కు చేరింది. ఈ చెరువు పూర్తిస్థాయిలో నిండటం తో చిన్నచెరువు కూడా నిండిపోయి అలుగు పోస్తున్నది. నిండుకుండల్లా మారిన ఇబ్రహీంపట్నం పెద్ద, చిన్నచెరువులను చూసేందుకు స్థానికులు, శేరిగూడ, ఉప్పరిగూడ గ్రామస్తులతో పాటు నగరానికి చెందిన వారు కూడా అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. దాదాపుగా 45 ఏం డ్ల తర్వాత ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు అలుగు పారినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. కాగా పెద్ద చెరువు అలుగు పారుతుండటంతో మత్స్యకారులు చేపలు బయటికి వెళ్లకుండా జాలీలను ఏర్పాటుచేశారు.
స్తంభించనున్న రాకపోకలు..
దాదాపుగా 45 ఏండ్ల తర్వాత ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు శుక్రవారం నుంచి అలుగు పారుతుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ చెరువు అలుగు పోస్తుండటంతో నగరంతోపాటు ఇబ్రహీంపట్నం నుంచి ఉప్పరిగూ డ, పోచారం గ్రామాలకు వెళ్లే వాహనాల రాకపోకలు నిలిచిపోయే అవకాశాలున్నాయి. ఈ గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి నుంచి ఇబ్రహీంపట్నం పెద్దచెరువు వాగు పొంగిపొర్లుతున్నది. ఇప్పటికే రెండు గ్రామాలకు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
అలాగే, చెరువు అలుగు నుంచి ఇందిరాసాగర్కు నీరు వెళ్తున్నది. ఈ క్రమంలో శేరిగూడ సమీపంలో సాగర్ రహదారిపై వర్షం నీరు అధికంగా ప్రవహిస్తుండటంతో సాగర్ రహదారిపై నుంచి వాహనాల రాకపోకలను నిలిపివేసి బైపాస్ రోడ్డు నుంచి మళ్లించే అవకాశాలున్నాయి.
రెండు పునరావాస కేంద్రాల ఏర్పాటు
ఇబ్రహీంపట్నం చిన్నచెరువులో నీట మునిగి న ఇండ్ల బాధితులకోసం రెండు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఇబ్రహీంప ట్నం సమీపంలోని ఉర్దూ మీడియం పాఠశాలతోపాటు స్థానిక సాయి ఫంక్షన్ హాల్లో కేంద్రాలను ఏర్పాటు చేసి, వసతులను కల్పించడంతోపాటు ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకున్నాం. బాధితులంతా పునరావాస కేంద్రాలకెళ్లాలి.
– యూసఫ్, మున్సిపల్ కమిషనర్
జలమయమైన పరిసరాలు
ఇబ్రహీంపట్నం చిన్నచెరువులోని ఎఫ్టీఎల్ పరిధిలోని పరిసరాలు జలమయమయ్యాయి. ప్రస్తుతం ఇబ్రహీంపట్నం చిన్నచెరువుకు ఎగువ ప్రాంతాల నుంచి నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరుతుండటంతో ఆ ప్రాంతం పూర్తిగా నీటిలో మునిగిపోయింది. అలాగే, ఆయా కాలనీలకు వెళ్లే రోడ్లు కూడా పూర్తిగా మూసుకుపోయాయి.