బొంరాస్పేట : పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్కు ప్రజలు అండగా ఉండాలని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. మండలంలోని దుద్యాల నుంచి అల్లికాన్పల్లి వరకు రూ. 2.50కోట్లతో నిర్మించే బీటీ రోడ్డు పనులకు బుధవారం ఎమ్మెల్యే అల్లికాన్పల్లిలో శంకుస్థాపన చేసి పల్లెప్రకృతి వనాన్ని ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో పాలించిన ఏ ప్రభుత్వాలు కూడా రైతులను పట్టించుకోలేదని, తెలంగాణ వచ్చిన తరువాత రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు.
గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమాన్ని అమలు చేస్తుందని ఈ పథకం ద్వారా గ్రామాలు అభివృద్ధి చెందాయని అన్నారు. ఆర్థికంగా ఇబ్బందులున్నా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం కొనసాగిస్తుందని ఎమ్మెల్యే నరేందర్రెడ్డి చెప్పారు. నియోజకవర్గంలో రోడ్లను అభివృద్ధి చేయడానికి నిధులు మంజూరు చేయిస్తున్నామని అన్నారు. వానాకాలం ధాన్యం అమ్మిన డబ్బులను రైతులకు వారం రోజుల్లో చెల్లించే విధంగా కృషి చేస్తామని అన్నారు. ఎన్నికల సమయంలోనే రేవంత్రెడ్డికి గ్రామాలు, ప్రజలు గుర్తుకు వస్తారని ఎద్దేవా చేశారు. అల్లికాన్పల్లి గ్రామానికి పంచాయతీ భవనం, అంగన్వాడీ భవనం, హైమాస్ట్ విద్యుత్ దీపాలు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు.
గ్రామానికి ఎన్నో ఏళ్లు కలగా మిగిలిన బీటీ రోడ్డును మంజూరు చేయించినందుకు ప్రజలు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ హేమీబాయి, వైస్ ఎంపీపీ నారాయణరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు మహేందర్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కోట్ల యాదగిరి, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు చాంద్పాషా, ఎంపీటీసీ ఎల్లప్ప, నాయకులు దేశ్యానాయక్, నరేష్గౌడ్, బసిరెడ్డి, కవిత, యూనుస్ పాల్గొన్నారు.