బొంరాస్ పేట : సీఎం కేసీఆర్ ఉన్నంత వరకు రాష్ట్రంలో అన్నదాతల సంక్షేమం ఆగదని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి స్పష్టం చేశారు. రైతుబంధు ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం కొడంగల్ మండలంలోని ఎరన్పల్లి, లక్ష్మీపల్లి, సంగాయిపల్లి, అంగడిరాయిచూరు, కొడంగల్ పట్టణాల్లో నిర్వహించిన ఉత్సవాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. పలు గ్రామాల్లో ఎడ్లబండ్ల ఊరేగింపులో పాల్గొని సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కొడంగల్ మార్కెట్ కమిటీ ఆవరణలో జై కేసీఆర్, రైతుబంధు ఆకారంలో వేసిన ముగ్గులను ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అంటే రైతులకు ఒక భరోసా కలిగిందన్నారు.
రాష్ట్రంలో అన్నదాతలు టీఆర్ఎస్కు, కేసీఆర్కు అండగా ఉన్నారన్న అక్కసుతో వారిని సీఎం నుంచి వేరు చేయడానికి బీజేపీ కుట్ర పన్నిందని, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతులపై కక్షకట్టిందని, అందుకే యాసంగిలో పండించే ధాన్యాన్ని కొనడం లేదని చెప్పిందని నరేందర్రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత కేసీఆర్ ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న పథకాలతో సంతోషంగా పంటలు పండిస్తున్నారని అన్నారు. వచ్చే మార్చి నుంచి కొత్త పింఛన్లు, డబుల్బెడ్ రూం ఇళ్లు నిర్మిస్తామని, గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మించి ఇతర అభివృద్ధి పనులు చేపడుతామని ఎమ్మెల్యే చెప్పారు.
కార్యక్రమంలో ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్, పీఏసీఎస్ చైర్మన్ శివకుమార్, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు బస్వరాజ్, మున్సిపల్ కౌన్సిలర్ మధుయాదవ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బీములు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దామోదర్రెడ్డి, టీఆర్ఎస్ తాలుకా యూత్ అధ్యక్షుడు నరేష్గౌడ్, ఎంపీటీసీలు, సర్పంచ్లు, రైతులు పాల్గొన్నారు.