రెండు రాష్ర్టాల పల్లెలకు మధ్య దూరం ఒక్క అడుగే అయినా అభివృద్ధి, సంక్షేమంలో ఎంతో తేడా ఉన్నది. తెలంగాణ గ్రామాల్లో సాగునీటి కాలువలు, పచ్చని పంటపొలాలు, సకల వసతులు, అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతుండగా.. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం సరిహద్దుల్లో ఉన్న కర్ణాటక రాష్ట్ర గ్రామాల తీరు మరోలా ఉన్నది. పత్తాలేని సంక్షేమం, నీరు లేక పాడుబడిన కాలువలు, బీడు భూములే దర్శనమిస్తున్నాయి. అడుగు దూరంలో అంతులేని అభివృద్ధి, సంక్షేమం ఉన్నా.. నిత్యం కండ్లారా చూస్తున్నా అనుభవించలేని పరిస్థితి తమదని కర్ణాటకవాసులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతుబీమా, మిషన్ భగీరథ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, అమ్మఒడి, కేసీఆర్ కిట్, ఆసరా పింఛన్లు, దళితబంధు మరెన్నో పథకాలు పకడ్బందీగా అమలవుతుంటే.. తమ గ్రామాల్లో ఎక్కడ చూసినా అరకొర వసతులు, సమస్యలే దర్శనమిస్తున్నాయని వాపోతున్నారు. ప్రజా సంక్షేమం పట్టని తమ పాలకులతో విసుగెత్తి పోతున్నామని, తెలంగాణలో సాగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కర్ణాటకలోనూ అమలు చేయాలని తమ పాలకులను కోరుతున్నారు. సీఎం కేసీఆర్ పాలన దేశానికి ఎంతో అవసరమన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశమంతా తెలంగాణలా సస్యశ్యామలమవుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తాండూరు, ఏప్రిల్ 6: తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు మాకూ కావాలని తాండూరు నియోజకవర్గం సరిహద్దులో ఉన్న కర్ణాటక రాష్ట్రంలోని పలు గ్రామాల ప్రజలు, పేదలు కోరుతున్నారు. రెండు రాష్ర్టాల పల్లెలకు మధ్య దూరం ఒక్క అడుగే అయినా అభివృద్ధి, సంక్షేమంలో ఎంతో తేడా ఉన్నదంటున్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ సారథ్యంలో సంక్షేమ పాలన సాగుతున్నదని వారు పేర్కొంటున్నారు. ఇక్కడ వెలుగులు ప్రసరిస్తుండగా కర్ణాటకలో చిమ్మచీకటి నెలకొందని.. భూములు పడావు పడ్డాయని చెబుతున్నారు.
తెలంగాణలో అన్నదాతల పంటల సాగు కోసం 24 గంటల ఉచిత విద్యు త్తు సరఫరా.. మండువేసవిలోనూ పొలాల్లో పారుతున్న నీళ్లు, రైతులకు పెట్టుబడి సాయం, బ్రిడ్జిల నిర్మాణం, ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే రూ.ఐదు లక్షల రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, గర్భిణు లు, బాలింతలకు అమ్మఒడి, కేసీఆర్ కిట్ వంటి పథకాలు.. వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు, చేనేత, గీత కార్మికులకు ఆసరా పిం ఛన్ క్రింద ప్రతినెలా ఆర్థిక సాయం అందజేత.. గ్రామజ్యోతి, గొర్రెల పంపిణీ, నేతన్న బీమా, దళితబం ధు వంటి పలు సంక్షేమ పథకాలు అమలవుతుండగా…అదే కర్ణాటక రాష్ట్రంలో ఎండిన పొలా లు, ఎప్పుడొస్తదో తెలియ ని కరెంటు, పేద రైతుల చేతుల్లో డబ్బులేక సరైన పంటలు సాగు కాక.. రైతు మరణిస్తే ఎలాంటి సాయం అందని దుస్థి తి నెలకొన్నది. అంతేకాకుండా పల్లెల్లో తాగునీటి ఇక్కట్లు.. ఈడొచ్చిన కుమార్తెకు ఆర్థిక స్థోమత సహకరించక వివాహం చేయలేక తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు.. చదువుకు న్నా సరైన ఉపాధి లేక.. ప్రభుత్వ సాయం అందక ఇబ్బందులు పడుతున్న యువతరం …ఇలాంటి ఎన్నో సమస్యలు కర్ణాటక రాష్ట్రంలోని పలు గ్రామాల్లో కనిపిస్తున్నా యని వారు పేర్కొంటున్నారు. దీంతో వారు మాకు కూడా సం క్షేమ పథకాలు అందలాంటే బీఆర్ఎస్ పార్టీ దేశంలో అధికారంలోకి రావాలని కోరుతున్నారు. సీఎం కేసీఆర్కు అండగా ఉంటామని తెలుపుతున్నారు.
ఆడబిడ్డ పెండ్లికి చాలా ఇబ్బంది..
తెలంగాణలో ఉన్నట్టు నాలాంటి పెండ్లీడుకు వచ్చిన వారికి కర్ణాటకలో ఎలాంటి ఆర్థిక సహాయం అందిస్తలేరు. తెలంగాణ రాష్ట్రం బషీరాబాద్ సరిహద్దులోనే మా అల్కోడ గ్రామం ఉన్నది. మా ప్రభుత్వం నాలాంటి వారికోసం ఎలాంటి సహాయం అందిస్తలేదు. అమ్మానాన్న పడుతున్న ఇబ్బందులు చూడ లేక నేను హైదరాబాద్లోని ఒక దుకాణంలో పనిచేస్తున్నా. తెలంగాణలో ఉన్నట్లు మహిళల కోసం ఇక్కడా ప్రత్యేక పథకాలు ఉంటే బాగుంటుండే. అదే తెలంగాణలో మా గ్రామముంటే మా అమ్మనాన్నలు నాకు పెళ్లిచేస్తే కల్యాణలక్ష్మి కింద రూ.100116 వచ్చేవి. నాలాంటి ఎంతో మంది యువతులు ఆర్థిక ఇబ్బందులతో పెళ్లి చేసుకోవడంలేదు.
– జ్యోతి, అల్కోడ, కర్ణాటక
దేశంలో బీఆర్ఎస్ అధికారంలోకి కావాలి
తెలంగాణలో అమలవుతున్న పథకాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. తెలంగాణలో పుట్టి పెరిగిన నేను వివాహం తర్వాత కర్ణాటక రాష్ర్టానికి వెళ్లడంతో ప్రజల సమస్యలు కళ్లారా చూస్తున్నా. అనేక మంది పేదలు ఇబ్బందులకు గురవుతున్నారు. పంటల సాగుకు డబ్బుల్లేక ఇతరుల వద్ద అప్పులు చేస్తున్నారు. పంటలు అమ్మగా వచ్చిన మొత్తాన్ని వడ్డీలకు చెల్లించి ఆర్థికంగా చితికిపోతున్నారు. ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ పథకాలను అమలు చేయకపోవడంతో మహిళలు, నిరుద్యోగులు ఇండ్ల వద్ద ఉంటున్నారు. పేదల ఇబ్బందులు తీరాలంటే తెలంగాణలో కొనసాగుతున్న సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలి. దేశంలోని అన్ని రాష్ర్టాల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలి. అప్పుడే ప్రజలకు మేలు జరుగుతుంది.
– గాయత్రి, మదుకల్,కర్ణాటక రాష్ట్రం
దళితబంధు పథకం చాలా బాగున్నది
ఉన్నత విద్యాభ్యాసం చేసి ప్రభుత్వ ఉద్యోగం లేక విద్యావలంటర్గా పనిచేస్తున్నా. తెలంగాణలో కొనసాగుతున్న దళితబంధు పథకం చాలా బాగున్నది. ఆ పథకం ఎంతో మంది దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. ఎంతోమంది ప్రభుత్వం అందించే ఆర్థి క సాయంతో వాహనాల కొనుగోలు, వ్యాపారాలు, వివిధ రకాల కంపెనీలు, సంస్థలను ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా వృద్ధి చెందడంతోపాటు పలువురికి ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోనూ ఆ పథకం అమల్లో ఉంటే నాతోపాటు చాలా మంది నిరుద్యోగులకు రూ. పది లక్షల ఆర్థిక సాయం అందేది. దాని ద్వారా నేను ఓ వ్యాపారాన్ని ప్రారంభించి సంతోషంగా జీవించేవాడ్ని. తెలంగాణలో అమలవుతున్న పథకాలు బడుగు, బలహీన వర్గాలకు అందాలంటే కర్ణాటకతోపాటు దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలి. తెలంగాణ సీఎంకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుంది. – విజయ్కుమార్, కల్లూరు, కర్ణాటక
గర్భిణులు, బాలింతలకు
ఎలాంటి సాయం అందడంలేదు
కర్ణాటకలో తెలంగాణ మాదిరి పథకాలు అమలు కావడం లేదు. అక్కడ గర్భిణులను అమ్మఒడి వాహనాల్లో దవాఖానలకు తీసుకెళ్లి తిరిగి ఇంటి వద్ద దింపుతారు. పైసా ఖర్చు లేకుండా మెరుగైన వైద్యం అందుతున్నది. ప్రభుత్వ దవాఖానల్లో డెలివరీ అయితే కేసీఆర్ కిట్తోపాటు తల్లీబిడ్డకు కావాల్సిన మెటీరియల్ ఇస్తున్నారు. అంతేకాకుండా అమ్మా యి పుడితే రూ.13 వేలు, అబ్బాయి పుడితే రూ.12 వేలు ఇవ్వడం చాలా బాగున్నది. ఈ పథకం పేదలకు ఎంతో మేలు చేస్తుంది. మేము ఏ పాపం చేశామో తెలంగాణలో పుట్టక అనిపిస్తున్నది. మాకు ఎలాంటి సాయాన్ని అందించడం లేదు.
– లక్ష్మి, కల్లూరు, కర్ణాటక
విద్యుత్ కోతలతో పంటలకు నష్టం
కర్ణాటకలో పంటల సాగుకు విద్యుత్తును ఉచితంగా సరఫరా చేస్తున్నా అది కేవలం 7 గంటలే. అది కూడా సక్రమంగా ఉండటం లేదు. కరెంట్ ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. దీంతో పంటలను ఎలా పండించుకోవాలి..? మా కష్టాన్ని ఎవరికీ చెప్పుకోవాలి? పంటల సాగుకు డబ్బు చేతిలో లేకపోవడంతో వ్యాపారులు, తెలిసిన వారి వద్ద అప్పు లు తీసుకు రావాల్సి వస్తున్నది. పండిన పంట తీసుకొచ్చిన అప్పుల వడ్డీకే సరిపోతున్నది. దీంతో తాము పంటలను సాగు చేసిన ఏమి గిట్టుబాటు కావ డం లేదు. తెలంగాణలో రైతులకు ఇస్తున్నట్లుగా పంటల సాగుకు పెట్టుబడి సాయం ఇచ్చి ప్రభుత్వం ఆదుకుంటే చాలా మంచింది. దాని ద్వారా ఎరువులు, విత్తనాలను సకాలంలో కొ నుగోలు చేసి.. పంటలను సాగు చేసుకుం టాం. అంతేకాకుండా విద్యుత్తు సరఫరాను కూ డా నిరంతరంగా అందించాలి. అప్పుడు పంటలకు నష్టం జరుగదు. – శ్రీశైల్, దస్తపూర్, కర్ణాటక
కిరాణా షాపు పెట్టుకుని బతుకుతున్నా..
తెలంగాణలో కొనసాగుతున్న పథకాలు మా రాష్ట్రంలోనూ అమలు కావాలి. ఉన్నత విద్యాభ్యాసం చేసినా ఉద్యోగం లేక .. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందకపోవడంతో ఓ కిరాణా షాపు పెట్టుకొని కుటుంబాన్ని పోసిస్తున్నా. నాలాంటి ఎంతోమంది యువకులు ఉన్నత విద్యాభ్యాసం చేసి నిరుద్యోగులుగా మారారు. మా రాష్ట్రం తాండూ రు సరిహద్దుకు కూతవేటు దూరంలోనే ఉన్నా తెలంగాణ లో అమలవుతున్న పథకాలు ఒకటి కూడా ఇక్కడ లేవు. – శివకుమార్, మిరియాన్, కర్ణాటక
తెలంగాణ మాదిరి పాలన మాకూ కావాలి
ఒక్కోసారి నా రెండు కండ్లు సరిగా కనిపించవు. దవాఖానకు వెళ్తామంటే ఆర్థిక స్థోమత సహకరించడంలేదు. దీంతో ఆ విధంగానే రోజులు గడుపుతున్నా. తెలంగాణలో ఉన్నట్లు మా కర్ణాటకలోనూ కంటి వెలుగు కార్యక్రమం కొనసాగితే నేను ఆ శిబిరాలకు వెళ్లి కంటి పరీక్షలు చేయించుకుని ఉచితంగా అద్దాలు, మందులను తెచ్చుకునేది. కానీ.. ఇక్కడి ప్రభుత్వం ఎలాంటి ఆరోగ్య పథకాలను అమలు చేయడంలేదు. దీంతో పేదలు, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నా రు. తెలంగాణ మాదిరి పాలన మాకూ కావాలి.
– సుభద్రమ్మ, అల్కోడ, కర్ణాటక
పాలకుల నిర్లక్ష్యంతోనే..
కర్ణాటకలో పాలకుల నిర్లక్ష్యంతోనే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రజా సంక్షేమానికి సరైన పథకాలు లేకపోవడంతో చిన్న, చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తున్నాం. మా ప్రాంతం తెలంగాణ రాష్ర్టానికి కూత వేటు దూరంలోనే ఉన్నా.. సంక్షేమ, అభివృద్ధి పథకాలు మాత్రం అమలు కావడం లేదు. మాకూ తెలంగాణ మాదిరిగా పాలన కావాలి.. లేదా మమ్మల్ని తెలంగాణలో కలపాలి. తెలంగాణలోని ప్రజలు చదువుకు తగిన పనులు చేసుకుంటూ ఆనందంగా జీవిస్తున్నారు. సీఎం కేసీఆర్తోనే దేశాభివృద్ధి సాధ్యం.
– మహ్మద్ బషీర్, మిరియాన్, కర్ణాటక